కేసీఆర్‌కే టోపీ పెట్టిన జగన్‌

గత ఎన్నికల్లో సాయం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జగన్‌ టోపీ పెట్టారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Updated : 04 Jun 2023 07:02 IST

అవినాష్‌రెడ్డి, భారతిరెడ్డిని  కాపాడటానికి కుట్ర
అందుకు శరత్‌చంద్రారెడ్డిని బలి చేశారు
మైదుకూరు సభలో  నారా లోకేశ్‌ ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, కడప: గత ఎన్నికల్లో సాయం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జగన్‌ టోపీ పెట్టారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. వివేకా హత్య కేసు నుంచి బయటపడటానికి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌ చంద్రారెడ్డిని బలి ఇచ్చారని ఆరోపించారు. ‘దిల్లీ మద్యం కుంభకోణం దెబ్బకి వివేకా హత్య కేసు బలహీనమైంది. అవినాష్‌రెడ్డి, భారతిరెడ్డిని కాపాడటానికి కవితను బలి ఇస్తున్నట్లుగా దిల్లీలో ప్రచారం అవుతోంది’ అని ఆరోపించారు. ‘సీఎం జగన్‌ సొంత కుటుంబ సభ్యుల్ని, పార్టీ నాయకుల్ని మింగేస్తున్నారు. వివేకా హత్యకేసులో ఆయన సొంత చెల్లే ‘రహస్య సాక్షి’ అని వినిపిస్తోంది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా శనివారం వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు చేరుకున్న లోకేశ్‌.. బహిరంగసభలో మాట్లాడారు. ‘నిన్న హడావుడిగా మావాళ్లు స్పెషల్‌ స్టేటస్‌ వచ్చింది అన్నారు. ఇంతకీ వారు చెప్పింది వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్‌ భాస్కరరెడ్డిని చంచల్‌గూడ జైల్లో స్పెషల్‌ స్టేటస్‌ ఖైదీగా చూడాలనే ఉత్తర్వుల గురించి’ అంటూ ఎద్దేవా చేశారు. ‘కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా... హూ కిల్డ్‌ బాబాయ్‌? మీ జిల్లా ప్రజలే అది జగనాసుర రక్త చరిత్ర అని బహిరంగంగా చెబుతున్నారు’ అని లోకేశ్‌ ఆరోపించారు. ‘కడపకు ఏం చేశామో చెప్పే దమ్ము నాకుంది. పులివెందుల బస్టాండు కట్టడానికే వీళ్లకు నాలుగేళ్లు పట్టింది. జిల్లాకు జగన్‌ చేసింది ఏమైనా ప్రెస్‌మీట్లో చెప్పే దమ్ముందా? అని సవాలు విసిరారు. ‘చంద్రన్న మేనిఫెస్టోతో తాడేపల్లి ప్యాలెస్‌లో భూకంపం వచ్చింది. పరదాల్లేకుండా జనంలోకి రాలేని బతుకు జగన్‌ది. క్లెమోర్‌మైన్లకే భయపడని కుటుంబం మాది. చీకట్లో విసిరే కోడిగుడ్లకు భయపడతానా?ప్రొద్దుటూరులో చూసింది ఓ ట్రైలర్‌ మాత్రమే. మా నాన్నకు ఉన్నంత ఓపిక నాకు లేదు. ఎవరైనా ఎదురొస్తే సత్తా చూపిస్తాం’ అని హెచ్చరించారు. ‘వైయస్‌ఆర్‌ జిల్లాలో మేం ప్రాజెక్టులు కడితే.. జగన్‌ పడగొట్టారు. నేను నిలదీస్తే నిన్న హడావుడిగా గండికోట నిర్వాసితులకు న్యాయం చేస్తాం.. అంటూ చర్యలు మొదలుపెట్టారు. రైతుల వద్ద నాలుగేళ్లుగా పసుపు కొనలేదు. శనివారం హడావుడిగా పసుపు కేంద్రాలు తెరిచారు. జగన్‌ మైథోమానియా సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్ధాలు చెప్పడం దాని లక్షణం. రూ.లక్షల కోట్ల ఆస్తి ఉన్నా, రూ.లక్ష విలువైన చెప్పులు వేసుకొని తిరుగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్ధం చెబుతున్నారు’ అని విమర్శించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు