Amit Shah - Chandrababu: అమిత్‌షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ

దేశ రాజధాని దిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకొంది. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సుమారు 50 నిమిషాలపాటు భేటీ అయ్యారు.

Updated : 04 Jun 2023 08:35 IST

సుమారు 50 నిమిషాలపాటు చర్చలు
ఈనాడు - దిల్లీ

దేశ రాజధాని దిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకొంది. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శనివారం రాత్రి ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సుమారు 50 నిమిషాలపాటు భేటీ అయ్యారు. 2018లో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి బయటికొచ్చిన తర్వాత అమిత్‌షా, చంద్రబాబుల భేటీ జరగడం ఇదే ప్రథమం. ఒకవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో వీరి సమావేశం ప్రాధాన్యం సంతరించుకొంది. శనివారం సాయంత్రం ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామమోహనరావులతో కలిసి దిల్లీకి వచ్చిన చంద్రబాబునాయుడుకు విమానాశ్రయంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. అనంతరం అంతా కలిసి ఇక్కడి అశోకా రోడ్డులోని ఎంపీ గల్లా జయదేవ్‌ నివాసానికి చేరుకున్నారు. రాత్రి 8.55 గంటలకు చంద్రబాబు ఒక్కరే కృష్ణ మీనన్‌ మార్గ్‌లోని అమిత్‌షా ఇంటికి వచ్చారు. తర్వాత కొద్దిసేపటికే భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి చేరుకున్నారు. ముగ్గురి మధ్య రాత్రి 9.49 గంటల వరకు సమాలోచనలు జరిగాయి. సమావేశం అనంతరం ఎవరూ విలేకర్లతో మాట్లాడలేదు.హోంమంత్రితో జరిగిన సమావేశంలో జేపీ నడ్డా కూడా పాల్గొన్నందున దీన్ని రాజకీయపరమైన భేటీగా భావిస్తున్నారు. అయితే భవిష్యత్తులో కలిసి పనిచేయడంపై చర్చించారా.. ఇంకా ఏదైనా అంశాలపై సమాలోచనలు జరిపారా.. అనేది తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని