ఎమ్మెల్యే చిన్నయ్యపై దిల్లీలో ఫిర్యాదు

బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, ఆయన అనుచరులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని దిల్లీ పోలీసులకు ఆరిజిన్‌ డెయిరీ నిర్వాహకురాలు శేజల్‌ ఫిర్యాదు చేశారు.

Published : 04 Jun 2023 04:17 IST

ఈనాడు-దిల్లీ, బెల్లంపల్లి-న్యూస్‌టుడే: బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, ఆయన అనుచరులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని దిల్లీ పోలీసులకు ఆరిజిన్‌ డెయిరీ నిర్వాహకురాలు శేజల్‌ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ దిల్లీ తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసిన శేజల్‌ ప్రస్తుతం ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆమె స్పృహలోకి రావడంతో దిల్లీ పోలీసులు ఆసుపత్రికి వచ్చి ఆమె నుంచి వాంగ్మూలం సేకరించారు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేని స్థితికి చేరుకోవడంతోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. శేజల్‌ వాంగ్మూలం సేకరించడంతో ఎమ్మెల్యే చిన్నయ్య, ఆయన అనుచరులపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చర్యలు తీసుకోవాలి: శేజల్‌

బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య తన రాజకీయాల కోసం తమ బతుకులతో చెలగాటం ఆడుతున్నారని ఆరిజిన్‌ డెయిరీ నిర్వాహకురాలు శేజల్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆమె పేరిట సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదలయింది. ఎమ్మెల్యేపై తెలంగాణ పోలీసులు తక్షణమే కేసు నమోదు చేయాలని కోరారు. అప్పుడే ఆయన మోసాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు బయటకొస్తాయన్నారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసి.. తనకు న్యాయం చేసేవరకు పోరాటం ఆగదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని