ధరణిని వద్దన్న కాంగ్రెస్‌నే బంగాళాఖాతంలో వేద్దాం

దేశాన్ని, రాష్ట్రాన్ని యాభై ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ ప్రజలకు ఏం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. కనీసం తాగేందుకు మంచినీళ్లు సైతం ఇవ్వనివారు.. వచ్చే ఎన్నికల కోసం ధరణి పోర్టల్‌ను రద్దు చేసి బంగాళాఖాతంలో కలిపేద్దామంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Updated : 05 Jun 2023 06:28 IST

అభివృద్ధి కొనసాగాలంటే భారాసను ఆశీర్వదించండి
ఎన్నికలయ్యాక తాలూకాకు ఒక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభిస్తాం
నిర్మల్‌ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈటీవీ, ఆదిలాబాద్‌: దేశాన్ని, రాష్ట్రాన్ని యాభై ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ ప్రజలకు ఏం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశ్నించారు. కనీసం తాగేందుకు మంచినీళ్లు సైతం ఇవ్వనివారు.. వచ్చే ఎన్నికల కోసం ధరణి పోర్టల్‌ను రద్దు చేసి బంగాళాఖాతంలో కలిపేద్దామంటూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నిర్మల్‌లో ఆదివారం సమీకృత కార్యాయాల భవన సముదాయంతోపాటు భారాస జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్‌  ప్రారంభించారు. అనంతరం నిర్మల్‌ సమీపంలోని ఎల్లపెల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థలో మళ్లీ పట్వారీలు, వీఆర్వోలు, పైరవీకారులను తెచ్చి పహాణీలను తారుమారు చేసి.. దోపిడీకి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు మంచి చేసే ధరణి పోర్టల్‌ను రద్దు చేద్దామా? లేక ఆ పోర్టల్‌ను రద్దు చేద్దామంటున్న కాంగ్రెస్‌ పార్టీనే బంగాళాఖాతంలో కలిపేద్దామా ఆలోచించాలని కోరారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి లబ్ధి పొందాలనుకునే ప్రతిపక్షాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కొనసాగాలంటే భారాసను ఆశీర్వదించాలని కోరారు. కులమతాల పేరిట కాకుండా పేదల సంక్షేమం కోసం భారాస ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. దేశ అభివృద్ధి సూచికలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు.

ఒకప్పుడు ధాన్యం విక్రయించుకోవాలంటే పడిగాపులు కాయాల్సి వచ్చేదని.. భారాస అధికారంలోకి వచ్చిన తరువాత సొంత ఊళ్లోనే అమ్ముకునే వెసులుబాటు కల్పించామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పక్కన ఉన్న మహారాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతోంటే జీర్ణించుకోని ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని విమర్శించారు. మహారాష్ట్రలో భారాస ప్రభుత్వం కొలువుదీరాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఆశీస్సులతో ఎన్నికలయ్యాక తాలూకాకు ఒకటి చొప్పున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రారంభిస్తామని ప్రకటించారు. తద్వారా ఉద్యోగావకాశాలు కల్పించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. సొంత స్థలాలున్నవారికి గృహలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున అందించనున్నట్లు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రెండో విడత కింద గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు.

నిర్మల్‌ జిల్లాపై వరాల జల్లు

నిర్మల్‌ జిల్లాపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిర్మల్‌ జిల్లాలోని 19 మండలాలకు రూ.20 లక్షల చొప్పున, 396 గ్రామపంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాసర అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తామని, త్వరలోనే పునాదిరాయి వేయడానికి వస్తానని ప్రకటించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరిక మేరకు నూతనంగా ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనేది పరిశీలిస్తామని వివరించారు. సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షత వహించగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌, జోగు రామన్న, బాల్క సుమన్‌, రాఠోడ్‌ బాపురావు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

15 నిమిషాల ముందే సభా స్థలికి రాక..

ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎల్లపెల్లి సభాస్థలికి సాయంత్రం 6.30 గంటలకు సీఎం కేసీఆర్‌ రావాల్సి ఉంది. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఓ దశలో బహిరంగ సభకు కేసీఆర్‌ వస్తారా.. రారా.. అనే అనుమానం వ్యక్తమైంది. కానీ, అనుకున్న సమయం కన్నా 15 నిమిషాల ముందే ఆయన చేరుకున్నారు. 6.20 గంటలకు ప్రారంభించి.. 20 నిమిషాల పాటు ప్రసంగించారు.

కేసీఆర్‌తో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం కుమారుడి భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి అజిత్‌ జోగి తనయుడు అమిత్‌ జోగి భేటీ అయ్యారు. నిర్మల్‌లోని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాసంలో ఆదివారం కేసీఆర్‌తో ఆయన ఏకాంతంగా చర్చలు జరిపారు. అమిత్‌ జోగి భారాసలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాల నుంచి ప్రాథమికంగా తెలిసింది.


కాంగ్రెస్‌కు అవకాశమిస్తే రైతుబంధు, దళితబంధులకు రాంరాం అంటుంది. రైతులు, పేదల ముఖాల్లో ఆనందం చూడాలనే సదుద్దేశంతోనే భారాస ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా హైదరాబాద్‌ నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులను జమ చేస్తోంది. రైతు మరణిస్తే రైతుబీమా పథకం కింద రూ.5 లక్షలు అందిస్తోంది. వ్యవసాయం కోసం ఎన్ని మోటార్లు పెట్టుకున్నారని అడిగేవారు లేకుండా ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. కాంగ్రెస్‌కు అవకాశమిస్తే పైరవీకారులు రావడమే కాకుండా.. మళ్లీ దోపిడీ పునరావృతమవుతుంది.        

సీఎం కేసీఆర్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని