సామాజిక తెలంగాణ సాధనకు మరో పోరాటం

రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు సామాజిక తెలంగాణ సాధనకు మరో పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు.

Updated : 05 Jun 2023 06:19 IST

తెజస ప్లీనరీలో ఆచార్య కోదండరాం పిలుపు

సూర్యాపేట (మహాత్మాగాంధీ రోడ్డు), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు సామాజిక తెలంగాణ సాధనకు మరో పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పిలుపునిచ్చారు. సూర్యాపేటలో ఆదివారం నిర్వహించిన తెజస మూడో ప్లీనరీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉద్యమ ఆకాంక్షలను తుంగలోకి తొక్కి సొంత ఎజెండాను అమలు చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. దేశంలో అత్యధిక అప్పు ఉన్న రాష్ట్రం తెలంగాణయేనని విమర్శించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతోంటే.. కనీసం ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటన్నారు. పోడు రైతులకు పట్టాలివ్వడం లేదని.. విద్య, వైద్యం ఉచితంగా అందట్లేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ శక్తులు, ఉద్యమకారులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. భారాసను ఎదుర్కొనే స్థితిలో కాంగ్రెస్‌, భాజపాలు లేవని.. సామాజిక, ప్రజాస్వామిక శక్తులు, పౌర సమాజాలతో సరికొత్త పంథాను రూపొందించి కేసీఆర్‌ను ఓడగొడతామని ఆయన పేర్కొన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కలిసివచ్చే పార్టీలతో ముందుకెళ్తామని చెప్పారు.

తెజస కచ్చితంగా స్వతంత్ర ఉనికితో నిలబడి కలబడుతుందన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు, విద్య, వైద్యం, ధరణి, సింగరేణి ప్రైవేటీకరణ, అటవీ హక్కుల చట్టం అమలు, కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా, మద్యం నియంత్రణ తదితర అంశాలపై పోరాడతామని తీర్మానించారు. . ఆయనను మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు ప్లీనరీలో ప్రకటించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుంట్ల ధర్మార్జున్‌, బైరు రమేష్‌, గోపగాని శంకర్‌రావు, అంబటి శ్రీనివాస్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆచార్య పీఎల్‌ విశ్వేశ్వరరావు, గట్ల రమాశంకర్‌, మాండ్ర మల్లయ్య, బోమ్మగాని వినయ్‌, నారబోయిన కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు. కాంగ్రెస్‌లో తెజస విలీనం కాబోతోందా అని విలేకరులు ప్రశ్నించగా.. ప్రజల ఆకాంక్షల కోసం అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే చేయవలసిన ప్రయత్నాలు చేస్తామని బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని