భాజపా వస్తే విద్యుత్తు ప్రైవేటుపరం: హరీశ్‌రావు

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పవర్‌ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు పవర్‌ (అధికారం) లేకుండా చేశారని, విరామం లేకుండా విద్యుత్తును అందిస్తున్నందుకే సీఎం కేసీఆర్‌ను మళ్లీమళ్లీ గెలిపిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Published : 06 Jun 2023 03:45 IST

మెదక్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పవర్‌ హాలిడే ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీకి రాష్ట్ర ప్రజలు పవర్‌ (అధికారం) లేకుండా చేశారని, విరామం లేకుండా విద్యుత్తును అందిస్తున్నందుకే సీఎం కేసీఆర్‌ను మళ్లీమళ్లీ గెలిపిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. సోమవారం జిల్లా కేంద్రం మెదక్‌లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్తు ప్రగతిపై నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. బావుల వద్ద మీటర్లు పెట్టాలని, విద్యుత్తు సంస్కరణలు అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఒత్తిడి తీసుకొస్తోందన్నారు. కేంద్రంలో తిరిగి భాజపా అధికారంలోకి వస్తే విద్యుత్తుశాఖ సిబ్బంది ఉద్యోగాలు ఊడటం ఖాయమని హెచ్చరించారు. విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీలను ప్రైవేటుపరం చేస్తే నెలకు రూ.6 వేల కోట్లు ఇస్తామని కేంద్రం సూచించినా తాము అంగీకరించలేదన్నారు. సీఎం కేసీఆరే రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తిరిగి 8 గంటలే సరఫరా ఉంటుందని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు హయాంలో విద్యుత్తు బిల్లులు పెంచడం వల్లనే స్వరాష్ట్ర సాధన ఉద్యమం పుట్టిందని, అప్పట్లో కేసీఆర్‌ తెలంగాణ జెండా ఎత్తారని మంత్రి గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని