కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల మళ్లింపుపై శ్వేతపత్రం

కేంద్రం వివిధ పథకాల కింద ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడంపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ పేర్కొన్నారు.

Published : 06 Jun 2023 04:34 IST

10న శ్రీకాళహస్తిలో నడ్డా బహిరంగ సభ
భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

ఈనాడు, తిరుపతి: కేంద్రం వివిధ పథకాల కింద ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడంపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ పేర్కొన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులు, రాష్ట్ర వాటా కింద ఇచ్చినవి, అవినీతి వంటి అంశాలన్నింటినీ ఇందులో పొందుపరచనున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో దీనిపై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని తెలిపారు. సోమవారం తిరుపతిలో ఆయన మీడియాతో  మాట్లాడారు. ‘ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఇచ్చిన నిధుల దారి మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపడుతోంది. అందుకే నిధులు నిలిపివేసింది. జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఇచ్చిన నిధుల దుర్వినియోగం, దారి మళ్లింపుపై కూడా కేంద్రం విచారిస్తోంది. సంక్షేమం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి కూడా ప్రజలకు నేరుగా అందట్లేదు. వివిధ రకాల పేర్లు పెట్టి దారి మళ్లిస్తున్నారు. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కేంద్రం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తాం. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం కావడంలో ఎటువంటి రాజకీయ కోణం లేదు. వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే ఆస్కారం ఉంది. శ్రీకాళహస్తిలో ఈ నెల 10వ తేదీన జరిగే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొంటారు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని