సహకార డెయిరీలపై ప్రభుత్వం కక్ష

రాష్ట్రంలో పాడి రైతులు, సహకార డెయిరీ ప్రయోజనాలకన్నా గుజరాత్‌కు చెందిన అమూల్‌ డెయిరీ ప్రయోజనాలే వైకాపా ప్రభుత్వానికి ముఖ్యమయ్యాయని సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ విమర్శించారు.

Published : 06 Jun 2023 05:11 IST

అమూల్‌ను పాడి రైతులు అడ్డుకోవాలి
సంగం డెయిరీ ఛైర్మన్‌ నరేంద్ర కుమార్‌

వడ్లమూడి(చేబ్రోలు), న్యూస్‌టుడే: రాష్ట్రంలో పాడి రైతులు, సహకార డెయిరీ ప్రయోజనాలకన్నా గుజరాత్‌కు చెందిన అమూల్‌ డెయిరీ ప్రయోజనాలే వైకాపా ప్రభుత్వానికి ముఖ్యమయ్యాయని సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ విమర్శించారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సమీపంలోని డెయిరీ ఆవరణలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోర్డు సమావేశంలో పాడి రైతుల కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం విలేకరుల సమావేశంలో నరేంద్రకుమార్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలు, సంస్థలు, వ్యవస్థల ప్రయోజనాలకంటే గుజరాత్‌కు చెందిన సంస్థల కోసమే పని చేస్తోందన్నారు. వైకాపా ప్రభుత్వం అమూల్‌ సంస్థకు ప్రజల సొమ్మును దోచి పెడుతోందని విమర్శించారు. పాడి రైతుల వ్యతిరేక చర్యలకు సంగం డెయిరీ అడ్డుగా ఉంటోందని భావించే ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమూల్‌ సంస్థ కోసం రూ.3 వేల కోట్ల నిధులు ఖర్చు చేసిందని, దీనిపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. కర్ణాటకలో అమూల్‌ డెయిరీ వద్దని అక్కడ ప్రజలు నిరసన తెలిపారని, తమిళనాడు సీఎం స్టాలిన్‌ అమూల్‌ ప్రవేశాన్ని ఆపాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారన్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రజలు నిరసన తెలియజేయడం ద్వారా రాష్ట్రంలోని సహకార డెయిరీలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. లీటరుకు 4రూపాయలు పశుపోషకులకు అదనంగా ఇస్తామని చెప్పి నాలుగేళ్లయినా రూపాయి కూడా ఇవ్వకపోగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డెయిరీల ఆస్తులను ప్రభుత్వం అమూల్‌ కోసం కేటాయించడం దారుణమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని