Nara Lokesh: సీమ రూపురేఖలు మారుస్తాం

అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో రాయలసీమ రూపురేఖలు మారుస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Published : 08 Jun 2023 05:46 IST

‘మిషన్‌ రాయలసీమ’ సభలో నారా లోకేశ్‌

ఈనాడు, కడప: అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో రాయలసీమ రూపురేఖలు మారుస్తామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. బుధవారం వైయస్‌ఆర్‌ జిల్లా కడప నగరంలో ‘మిషన్‌ రాయలసీమ’ పేరుతో జరిగిన బహిరంగ సభలో చర్చా వేదిక నిర్వహించారు. ప్రొఫెసర్‌ రాజేశ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించగా ప్రముఖులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ... ‘పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ప్రతి ఎకరానికి సాగునీరు, వాటర్‌గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు, ఆటోమోటివ్‌, ఎలక్ట్రానిక్‌ పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన, రాయలసీమలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు, శ్రీశైలం కేంద్రంగా రాయలసీమను పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయడం... మిషన్‌ రాయలసీమలో అంతర్భాగాలుగా ఉన్నాయి...’  అని వివరించారు. ‘రాయలసీమకు అండగా నిలబడింది పసుపు జెండా.. తెలుగుగంగ నుంచి హంద్రీ- నీవా వరకు ప్రాజెక్టులను తెచ్చి సీమ ప్రజల  తాగు, సాగునీటి కష్టాలు తీర్చడానికి కృషి చేసిందన్నారు. సీమకు కియా, ఫ్యాక్స్‌ కాన్‌, టీసీఎల్‌ వంటి పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించామని చెప్పారు. పలు ప్రశ్నలకు ముఖాముఖిలో లోకేశ్‌ సమాధానాలిచ్చారు. వివరాలు...

ప్రశ్న: నాయకుడు లోకేశ్‌ అని ఎప్పుడు అనిపించుకుంటారు?

లోకేశ్‌: అన్ని వర్గాల ప్రజలు తమను ప్రభుత్వం వేధిస్తోంది. మీరు రోడ్డు మీదకు రండని పిలిచిన తర్వాతే పాదయాత్రను ప్రారంభించాం. కుటుంబానికి దూరంగా ఉంటూ పాదయాత్ర చేయడానికి  ప్రజల బలం, ప్రోత్సాహం కారణం. రాయలసీమ ప్రజలు ఆదరించారు. దాడుల్ని తిప్పికొట్టారు. ప్రజల మనసు గెలుచుకున్న తర్వాత లోకేశ్‌ నిజమైన నాయకుడు అవుతాడు.

రాయలసీమ అంటే రౌడీయిజం, ఫ్యాక్షనిజం అన్న ముద్రలు వేశారు? 119 రోజుల్లో సీమపై మీకు కలిగిన భావన ఏమిటి?

సీమ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువ. ఇంటికి ఎవరైనా వస్తే అప్పు తెచ్చైనా అతిథుల ఆకలి తీరుస్తారు. పాదయాత్రలో దీనిని ప్రత్యక్షంగా చూశాను.

పాదయాత్రలో మీకు బాధ కలిగించిన ఘటన ఏది?

గంగాధర్‌ నెల్లూరులో మోహన అనే మహిళ చిన్న హోటల్‌ పెట్టుకుని ఇద్దరు బిడ్డలను చదివించింది. వారికి ఉద్యోగాలు రాలేదు. ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారని అడిగితే... పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని అడిగింది. చాలా బాధేసింది. బిడ్డలను చదివించుకుని.. ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు పడుతోంది.

లేపాక్షి భూముల్ని లాక్కొని ఉద్యోగాలిస్తామని ఇవ్వడం లేదు?

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌కు భూములు కేటాయించి 16 ఏళ్లు అయింది. మరో ఏడాదిలో తెదేపా వస్తుంది. ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తాం. ఈ భూమిపై అప్పు తీసుకుని బ్యాంకుకు కట్టకుండా ఐపీ పెట్టారు. రూ.500 కోట్లకు సీఎం తన బంధువులకు కట్టబెట్టాలని చూశారు. మేము పోరాడిన తర్వాత వెనక్కి తగ్గారు.

తాగు, సాగునీరు లేక అవస్థలు పడుతున్నాం?

2014లో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం. కొన్ని 30 శాతం నుంచి 90 శాతం వరకు పూర్తయ్యాయి. ఈ ప్రభుత్వం పనులు పక్కనబెట్టింది. పూర్తయిన ప్రాజెక్టుల నిర్వహణ కూడా లేక విద్యుత్తు బిల్లు కూడా కట్టడం లేదు. పట్టిసీమ ద్వారా కృష్ణా జలాలను రాయలసీమకు నీళ్లిచ్చాం. పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చాం. రూ.22 వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పనులు చేపట్టాం. ఈ ప్రభుత్వం నిలిపేసింది. తెదేపా అధికారంలోకి రాగానే ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు సాగునీటి కాల్వలు కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

* జగన్‌ వచ్చాక 4 ఏళ్లలో సీమ 30 ఏళ్లు వెనక్కి పోయింది. మహిళలు బిందెలు పట్టుకుని నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారు. పద్మావతి అనే చెల్లి పెనుగొండలో పాదయాత్రలో నన్ను కలిసి కియా అనుబంధ సంస్థల్లో పని చేస్తున్నానని చెప్పింది. దానికి కారణం చంద్రబాబు అని చెప్పింది. కుటుంబానికి పరిమితమైన మహిళ.. ఇంటిని నడిపించే స్థాయికి వెళ్లింది.

* పేదవాళ్లకు ఇచ్చిన సెంటు ఇళ్ల స్థలాల్లో రూ.7 వేల కోట్ల అవినీతి జరిగిందని లోకేశ్‌ ఆరోపించారు. ఈ మొత్తాన్ని అధికారంలోకి రాగానే తిరిగి రాబడతామన్నారు.

* పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్‌రెడ్డి రూ.5 లక్షల విరాళం చెక్కును లోకేశ్‌కు అందజేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని