మీరు సర్వ నాశనం కావాలి.. ప్రజలకు వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా శాపనార్థాలు

‘సైడు కాలువల నిర్మాణ పనులు అడ్డుకుంటారా, మీరంతా సర్వ నాశనం కావాలి’ అంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా స్థానికులకు శాపనార్థాలు పెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Updated : 08 Jun 2023 07:49 IST

2సార్లు గెలిపిస్తే ఇలా అంటారా?
క్షమాపణలు చెప్పాలని మహిళల డిమాండ్‌

గుంటూరు(పట్నంబజారు), న్యూస్‌టుడే: ‘సైడు కాలువల నిర్మాణ పనులు అడ్డుకుంటారా, మీరంతా సర్వ నాశనం కావాలి’ అంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా స్థానికులకు శాపనార్థాలు పెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండుసార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, మీరిచ్చే బహుమతి శాపనార్థాలా అంటూ డివిజన్‌ ప్రజలు మండిపడ్డారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలంటూస్థానిక మహిళలు డిమాండ్‌ చేశారు. బుధవారం పాతగుంటూరులో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. పాతగుంటూరు బ్రహ్మంగారి వీధిలో రూ.10 లక్షల వ్యయంతో 330 మీటర్ల పొడవున సైడు కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా వచ్చారు. మా ప్రాంతంలో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మించాలని.. పక్కా కాలువలు వద్దంటూ స్థానికులతో పాటు తొమ్మిదో డివిజన్‌ కార్పొరేటర్‌ ఎల్లావుల అశోక్‌ పనులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మీరు రోడ్లు, అండర్‌ డ్రైనేజీ పనులు చేపట్టకుండా సైడు కాలువలు నిర్మిస్తే, ఆ తర్వాత మేము పడే బాధలను పట్టించుకునే నాథుడే ఉండరంటూ స్థానికులు, మహిళలు అడ్డుచెప్పారు. దీనిపై మండిపడిన ఎమ్మెల్యే ముస్తఫా ‘డివిజన్‌లో అభివృద్ధి పనులను అడ్డుకుంటారా, మీరు సర్వనాశనం కావాలి’ అంటూ శాపనార్థాలు పెట్టారు. ఎమ్మెల్యే తీరుతో ఆగ్రహంచిన స్థానికులు, మహిళలు ఒక్కసారిగా ఆయన చుట్టూ గుమిగూడి ‘రెండేళ్ల నుంచి మా ప్రాంతం వైపు కన్నెత్తి చూశావా, ఎన్నికల సమయంలో ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించుకున్నావు.. ఇప్పుడొచ్చి సైడు కాలువలు   నిర్మిస్తామని చెబుతున్నావు’ అంటూ వాదనకు దిగారు. మీరంతా పథకం ప్రకారం డివిజన్‌లో  అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటున్నారు, వాటిని ఆపితే మీకే నష్టమంటూ ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని