Nara Lokesh: సీమ కష్టాలు చూశా.. కన్నీళ్లు తుడుస్తా..

‘‘కుప్పం నుంచి కడప వరకు.. 119 రోజులుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,516 కి.మీ. పాదయాత్ర చేశా. ఈ సుదీర్ఘ యాత్రలో సీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూశాను.

Updated : 08 Jun 2023 07:49 IST

ప్రతి ఎకరాకూ సాగునీరిస్తాం
ఉద్యాన హబ్‌గా తయారు చేస్తాం
90% రాయితీపై సూక్ష్మసేద్య పరికరాలు
క్రీడాకారులకు స్పోర్ట్స్‌ వర్సిటీ ‘మిషన్‌ రాయలసీమ’తో సమగ్రాభివృద్ధి చేస్తాం
డిక్లరేషన్‌ వెల్లడించిన నారా లోకేశ్‌

ఈనాడు, కడప: ‘‘కుప్పం నుంచి కడప వరకు.. 119 రోజులుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,516 కి.మీ. పాదయాత్ర చేశా. ఈ సుదీర్ఘ యాత్రలో సీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూశాను. అందరి కన్నీళ్లు తుడుస్తాను. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి బాట పట్టిస్తాను. అందుకే ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ‘మిషన్‌ రాయలసీమ’ ప్రకటిస్తున్నా..’’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం ఆయన కడపలో మిషన్‌ రాయలసీమ పేరుతో జరిగిన సభలో రాయలసీమ అభివృద్ధి ప్రణాళికను ప్రకటించారు. ‘తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మూడేళ్లలోనే వాటన్నింటిని స్వయంగా నేనే నెరవేరుస్తా.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా.. లేదంటే నన్ను నిలదీయండి...’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ‘2019లో సీమలోని 52 సీట్లలో 49 స్థానాల్లో వైకాపాను గెలిపించారు. ఏమైనా ప్రయోజనం ఉందా?. మీ కన్నీళ్లు తుడవాలంటే వైకాపాకు ఇచ్చిన  సంఖ్యా బలాన్ని తెదేపాకు ఇవ్వండి...’ అని విజ్ఞప్తి చేశారు.  రాయలసీమ నలుమూలల నుంచి పెద్దఎత్తున మేధావులు, నేతలు తరలివచ్చిన ఈ సభలో సీమ సమస్యలపై విస్తృతస్థాయిలో చర్చా వేదిక నిర్వహించారు.


డిక్లరేషన్‌లోని ప్రధానాంశాలు..

ఉద్యాన పంటల హబ్‌గా రాయలసీమ

* సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం.

* వలస కూలీలకు ఉపశమనం కల్పిస్తాం.

* మామిడి, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ, అరటి తదితర పంటల సాగు పెంచడానికి ప్రోత్సాహం ఇస్తాం.

*  90% రాయితీపై బిందు, తుంపర సేద్య పరికరాలిస్తాం.

* ఉద్యాన పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.

* టమాటాకు వాల్యూ చైన్‌ ఏర్పాటు చేస్తాం. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పిస్తాం.

* గుజ్జు పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం.

* మిర్చి, పసుపు కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.

* ఉద్యాన పంటలను ఉపాధి హామీకి అనుసంధానిస్తాం.

రైతుకు అండగా నిలుస్తాం

* తెదేపా అధికారంలోకి రాగానే.. రూ.20 వేలు చొప్పున ఇస్తాం.

* జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌, డిమాండ్‌కు అనుగుణంగా వంగడాలను అందుబాటులోకి తెస్తాం.

* వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల్ని రాష్ట్రంలోనే తయారు చేసి.. తక్కువ ధరతో రాయితీపై అందిస్తాం.

* నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు   మందుల ధరల్ని తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తాం.

*  రాష్ట్రాన్ని విత్తన హబ్‌గా తయారు చేస్తాం.

* వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పంటలు వేయాలో ప్రభుత్వం నుంచి సలహాలిస్తాం.

*  పంటలకు పాత బీమా పథకాన్ని అమలు చేస్తాం.

*  రైతుబజార్ల సంఖ్య పెంచుతాం.

*  కౌలు రైతులను గుర్తించి.. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాయం అందిస్తాం.

పేదలకు ఉచితంగా గొర్రెలు, మేకలు

*  పాడి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తాం.

* పశువుల కొనుగోలు దగ్గర నుంచి దాణా, మందులు వరకు అన్నీ రాయితీపై అందిస్తాం.

*  గోకులాల ఏర్పాటు. గొర్రెలు, మేకలు పెంపకం కోసం ప్రత్యేక సాయం.

* పేదలకు ఉచితంగా గొర్రెలు, మేకలు పంపిణీ.

* వాటి మేత కోసం బంజరు భూముల కేటాయింపు.

* పాడిరైతులకు రాయితీపై రుణాలు అందచేత.

ఇంటింటికి తాగునీరు

* వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు.

* భవిష్యత్తుకు హామీ ద్వారా సీమలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించడం.

ధరల్ని తగ్గిస్తాం

* పన్నులను ప్రక్షాళన చేస్తాం.

* పెట్రోలు, డీజిల్‌ ధరల్ని తగ్గించే బాధ్యత తెదేపా తీసుకుంటుంది. వాటి ధరలు తగ్గితే నిత్యావసరాల ధరలు కూడా తగ్గుతాయి.

పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగులకు ఉపాధి

* ఆటో, ఎలక్ట్రానిక్‌, డిఫెన్స్‌ సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహం.

* మైనింగ్‌ కంపెనీలు తెచ్చే బాధ్యత తీసుకుంటాం.

* మైనింగ్‌ తుది ఉత్పత్తి వరకు పూర్తి వాల్యూ చైన్‌ ఏర్పాటు.

* మైనింగ్‌ పనులు మనం రాష్ట్రం వాళ్లే చేసేలా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం.

* స్వయం ఉపాధికి రాయితీలు పెంచుతాం.

* సీమ జిల్లాలను ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలకు చిరునామాగా మారుస్తాం.

* బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ కారిడార్ల ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి కృషి.

* ఆటోమొబైల్‌, ఎలక్ట్రానిక్‌ కంపెనీల ద్వారా యువతకు ఉపాధి.

* లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకుని పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తాం.

సీమలో స్పోర్ట్స్‌ యూనివర్శిటీ

* రాయలసీమలో స్పోర్ట్స్‌ యూనివర్శిటీ ఏర్పాటు.

* స్పోర్ట్స్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా తీర్చిదిద్దుతాం.

* అంతర్జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులను తీర్చిదిద్దేలా శిక్షణ ఇప్పిస్తాం.

* క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌.. అన్ని రకాల క్రీడలకు స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ ఫెసిలిటీలు, స్టేడియంలు.

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి

* టెంపుల్‌, ఏకో, టైగర్‌ ఏకో టూరిజం ఏర్పాటు.

* గిరిజనులు, చెంచులకు ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పన.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని