చించినాడ ఘటనపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ

పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పెరుగులంక భూముల్లో తవ్వకాలపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు గురువారం కూడా కొనసాగాయి.

Published : 09 Jun 2023 05:38 IST

లంక భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

పాలకొల్లు, యలమంచిలి, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ పెరుగులంక భూముల్లో తవ్వకాలపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు గురువారం కూడా కొనసాగాయి. నిరసనల్లో పాల్గొన్న వారికి మద్దతుగా వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేయడం, కొందరు గాయపడిన విషయం విదితమే. ఈ క్రమంలో బాధితులను పరామర్శించడంతోపాటు పెరుగులంక భూములను పరిశీలించడానికి తెదేపా తరఫున నిజనిర్ధారణ కమిటీ సభ్యులు గురువారం చించినాడకు వచ్చారు. స్థానిక జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన శిబిరంలో కమిటీ సభ్యులు తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ మంత్రులు పీతల సుజాత, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ మాట్లాడారు. అనంతరం బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి పెరుగులంక భూములను పరిశీలించడానికి ర్యాలీగా జాతీయ రహదారిపై బయలుదేరారు. అప్పటికే అక్కడ మోహరించి ఉన్న పోలీసులు బారికేడ్లు పెట్టి రహదారికి అడ్డంగా నిలబడి కమిటీ సభ్యులను తెదేపా శ్రేణులను అడ్డుకున్నారు. లంకభూముల్లోకి వెళ్లడానికి అనుమతి లేదంటూ నరసాపురం డీఎస్పీ రవిమనోహరచారి కమిటీ సభ్యులకు చెప్పబోగా కేవలం క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతుందని, న్యాయమా..అన్యాయమా అనేది తెలుసుకోవడానికే వచ్చామని సభ్యులు తెలిపారు. గంటకుపైగా చర్చలు సాగినా ఎంతకీ అనుమతించకపోవడంతో సభ్యులు తిరిగెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని