రాజ్యసభలో తెరాస పేరు భారాసగా మార్పు

దిల్లీ రాజ్యసభ అధికారిక రికార్డుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత్‌ రాష్ట్ర సమితిగా మారింది. తెరాసను జాతీయ పార్టీగా విస్తరించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నాయకత్వం దాని పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చుకోగా అందుకు గతేడాది డిసెంబరు 8న కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది.

Published : 09 Jun 2023 04:19 IST

లోక్‌సభలో ఇంకా పాతపేరు కొనసాగింపు

ఈనాడు, దిల్లీ రాజ్యసభ అధికారిక రికార్డుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత్‌ రాష్ట్ర సమితిగా మారింది. తెరాసను జాతీయ పార్టీగా విస్తరించాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నాయకత్వం దాని పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చుకోగా అందుకు గతేడాది డిసెంబరు 8న కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ఎగువ సభలో వివిధ పార్టీలకున్న సంఖ్యాబలాన్ని వెల్లడిస్తూ రాజ్యసభ సచివాలయం గురువారం విడుదల చేసిన బులిటెన్‌లో తెరాస పేరుకు బదులు భారాసగా పేర్కొంది. వెబ్‌సైట్‌లోనూ మార్పు   చేసింది. ఏడుగురు సభ్యులున్న ఆ పార్టీ నేతగా కె.కేశవరావు పేరును పేర్కొంది. కేంద్ర మంత్రుల్లో మొత్తం 18 మంది ఎగువసభ సభ్యులున్నట్లు వెల్లడించింది. మే 15 నాటి సంఖ్యాబలం ప్రకారం భాజపాకు 93 మంది, కాంగ్రెస్‌కు 31, తృణమూల్‌ కాంగ్రెస్‌కు 12, డీఎంకే, ఆప్‌లకు 10 మంది చొప్పున, బిజూ జనతాదళ్‌, వైకాపాలకు 9 మంది చొప్పున, ఆర్‌ఎల్‌డీకి 6, సీపీఎంకి 5, జేడీయూకి 5, అన్నా డీఎంకేకి 4, ఎన్‌సీపీకి 4, సమాజ్‌వాదీ పార్టీకి 3, శివసేనకు 3, సీపీఐకి 2, జేఎంఎంకి 2 సభ్యుల బలం ఉన్నట్లు తెలిపింది. నామినేటెడ్‌ సభ్యులు 10 మందిలో అయిదుగురు భాజపాను ఎంచుకున్నట్లు పేర్కొంది. మిగిలిన అయిదుగురు.. మాజీ సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, సంగీత దర్శకుడు ఇళయరాజా, రాజమౌళి తండ్రి, కథారచయిత వి.విజయేంద్రప్రసాద్‌, క్రీడాకారిణి పీటీ ఉష, ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్రహెగ్డేలు స్వతంత్రంగా ఉన్నట్లు తెలిపింది. వీరు కాకుండా ఇండిపెండెంట్లు ముగ్గురు, తెదేపా, సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌, ఆర్‌పీఐ (అథావలే), జేడీఎస్‌, ఐయూఎంఎల్‌, ఏజీపీ, పీఎంకే, ఎండీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్‌ (మూపనార్‌), ఎన్‌పీపీ, మిజో నేషనల్‌ ఫ్రంట్‌, కేరళ కాంగ్రెస్‌ (ఎం), యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ (లిబరల్‌), ఆర్‌ఎల్‌డీలకు ఒక్కో సభ్యుడున్నట్లు ఈ బులిటెన్‌ వెల్లడించింది. లోక్‌సభ వెబ్‌సైట్‌లో మాత్రం తెరాస పేరు ఇప్పటికీ కొనసాగుతోంది. అందులో అధికారికంగా ఇంకా భారాసగా మార్చలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని