ధరణిని రద్దుచేసి తీరతాం

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బరాబర్‌ రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. కేసీఆర్‌ ధరణి తీసుకొచ్చి వేల ఎకరాలు కొట్టేశారని ఆరోపించారు.

Updated : 10 Jun 2023 06:37 IST

సెప్టెంబరు 17న మ్యానిఫెస్టో విడుదల చేస్తాం
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బరాబర్‌ రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. కేసీఆర్‌ ధరణి తీసుకొచ్చి వేల ఎకరాలు కొట్టేశారని ఆరోపించారు. సోమాజిగూడలోని ఓ హోటల్‌లో మూడు రోజులపాటు జరిగిన యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమానికి శుక్రవారం ఆయన హాజరై ప్రసంగించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘కొద్దిమంది భూస్వాముల కోసమే కేసీఆర్‌ ధరణి తెచ్చారు. 97శాతం భూవివాదాలకు ఈ పోర్టలే కారణం. దీని ఆధారంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లాల్లో వేల ఎకరాలను కేసీఆర్‌ బినామీలకు కట్టబెట్టారు. ఇది రద్దయితే రైతులకు రైతుబంధు రాదని కేసీఆర్‌ అంటున్నారు. పోర్టల్‌ ఏర్పాటు చేయకముందు నుంచే ఈ పథకం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు ప్రశ్నపత్రాల లీక్‌, ఎత్తిపోతల పథకాలు(లిఫ్ట్‌) మద్యం(లిక్కర్‌) అనే నినాదంతో పని చేస్తున్నారు. తెలంగాణలో 2004 నుంచి 2014 వరకు..  2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు చర్చకు సిద్ధమా..? కాంగ్రెస్‌ చేయనిది ఏదైనా మీరు చేసి ఉంటే మేం క్షమాపణ చెప్పడానికి సిద్ధం. అమరవీరుల స్తూపం, అంబేడ్కర్‌ విగ్రహం, సచివాలయ నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారు’’ అని పేర్కొన్నారు.

సెప్టెంబరు 17న కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో 

డిసెంబరు 9న సోనియాగాంధీ జన్మదిన కానుకగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపును ప్రజలు అందించాలి. వచ్చే సెప్టెంబరు 17న కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయాలని యోచిస్తున్నాం. అత్యంత కీలకమైన ఐదు అంశాలతో ప్రజల వద్దకు వెళ్తాం. వచ్చే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్‌ పోషించాల్సిన క్రియాశీలక పాత్రపై గత మూడు రోజులుగా జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించాం. క్షేత్రస్థాయిలో కీలకంగా పని చేసిన యువనేతలే రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులవుతారు. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేనే ఉదాహరణ’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు అంజన్‌కుమార్‌యాదవ్‌, పొన్నం ప్రభాకర్‌, అనిల్‌కుమార్‌యాదవ్‌, తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి ఏ.కృష్ణ, శివసేనారెడ్డి, బి.వి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

బీసీలను మభ్యపెట్టేందుకే ఆర్థిక సాయం: షబ్బీర్‌అలీ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: బీసీలకు చెందిన కుల వృత్తుల వారికి బ్యాంకు లింకేజీ లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయం అనేది కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ విమర్శించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ సంక్షేమ దినోత్సవం బదులు బీసీ ద్రోహ దినం పాటించాలని ఎద్దేవాచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తొమ్మిదేళ్లుగా ఆర్థిక సాయం కోసం బీసీల నుంచి అందిన లక్షల దరఖాస్తులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తక్షణం వాటిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళితబంధు లబ్ధిదారుల నుంచి భారాస ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా సీఎం కేసీఆరే అంగీకరించిన నేపథ్యంలో.. బీసీ రుణాలకు లబ్ధిదారుల ఎంపిక జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మభ్యపెట్టేందుకు ఈ నూతన ఆర్థిక సహాయం పథకం అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని