Balakrishna: నా వైపు వేలు చూపుతూ.. రెచ్చగొట్టారు: తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ

శాసనసభ నియంతృత్వ ధోరణిలో సాగుతోందని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. ‘మంత్రి అంబటి రాంబాబు నా వైపు వేలు చూపించి మీసం మెలేశారు.

Updated : 22 Sep 2023 08:39 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: శాసనసభ నియంతృత్వ ధోరణిలో సాగుతోందని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. ‘మంత్రి అంబటి రాంబాబు నా వైపు వేలు చూపించి మీసం మెలేశారు. తొడగొట్టి నన్ను రెచ్చగొట్టారు. వెళ్లి సినిమాలు చేసుకోవయ్యా అంటూ పరుషంగా మాట్లాడారు. నటన నా వృత్తి.. దాన్ని అవమానించారు. దీంతో నేను ప్రతిస్పందించాను. నా స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు. మేం ఎవరికీ భయపడం. ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. నేను సభలో హుందాగా, సౌమ్యంగా ఉంటానని అనుకున్న వైకాపా వాళ్లకు మతిపోయింది. ఏమీ అర్థంకాలేదు’ అని బాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

విశాఖపట్నంలో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమిట్‌ కూడా జూనియర్‌ ఆర్టిస్టులతో నిర్వహించిందేనా అని నిలదీశారు. ‘అమరావతి ఉద్యమానికి పోటీగా జూనియర్‌ ఆర్టిస్టులతో మూడు రాజధానుల ఉద్యమాన్ని నిర్వహించినట్టే.. విశాఖపట్నంలో సమిట్‌ నిర్వహించారు. అసలక్కడ జరిగిన ఒప్పందాలేంటి? ఎంతమంది పెట్టుబడులు పెట్టారు? వీటిలో దేనికీ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు పనులు చేయిస్తున్నారు. చంద్రబాబు, నారా లోకేశ్‌లకు ప్రజల్లో వస్తున్న మద్దతు చూసి ఓర్చుకోలేక, నయాపైసా అవినీతి జరగని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు వ్యవహారంలో ఆయన్ను జైలుకు పంపారు. ఇందులో బినామీలు లేరు, షెల్‌ కంపెనీలూ లేవు. ఇవన్నీ జగన్‌ మైండ్‌ గేమ్స్‌. వీటిని తెదేపా ఎప్పుడో చూసేసింది’ అని బాలకృష్ణ స్పష్టం చేశారు.

రాష్ట్రం ఏమైపోతుందోననే ఆవేదన కనిపించింది

‘మేం భువనేశ్వరితో కలిసి ములాఖత్‌కు వెళ్లినప్పుడు... రాష్ట్రం ఏమైపోతుందోననే ఆవేదన చంద్రబాబు కళ్లలో కనిపించింది. ఆయన మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మొదలు ఎవరికీ భద్రత లేదు. చివరికి రాష్ట్రాన్ని వదిలిపోవాల్సిన పరిస్థితులు తెచ్చారు. అసెంబ్లీలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని అడిగే స్థితి వచ్చింది. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి.. చంద్రబాబును 16 నిమిషాలైనా జైల్లో ఉంచాలని పన్నిన కుట్ర ఇదంతా. 2021లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ప్రభుత్వం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. రెండేళ్ల తర్వాత కేసును తెరపైకి తెచ్చి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు’ అని బాలకృష్ణ పేర్కొన్నారు. ‘చంద్రబాబు అంటే ఓ బ్రాండ్‌. ఆయన అరెస్టుకు నిరసనగా దేశవిదేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆయన అమలు చేసిన సంస్కరణల వల్ల లబ్ధి పొందిన ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు