ఇన్నేళ్లు బెయిల్‌పై ఎవరైనా ఉన్నారా?

దేశంలో అత్యధిక కాలం బెయిల్‌పై ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్‌ రికార్డు సృష్టించారని.. అంతటి ఘనత, గొప్ప అవకాశం ఆయనకే దక్కిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఎద్దేవా చేశారు.

Published : 24 Sep 2023 04:37 IST

జగన్‌కు దశమ బెయిల్‌ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఆయన రికార్డు నమోదుకు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌కు దరఖాస్తు చేశా  
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి వ్యంగ్యాస్త్రాలు

ఈనాడు, అమరావతి: దేశంలో అత్యధిక కాలం బెయిల్‌పై ఉన్న వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్‌ రికార్డు సృష్టించారని.. అంతటి ఘనత, గొప్ప అవకాశం ఆయనకే దక్కిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీ నమోదు చేసిన పలు ఆర్థిక నేరాల కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్‌.. బెయిల్‌ పొంది శనివారంనాటికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు ‘దశమ బెయిల్‌ వార్షికోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికపరమైన నేరాల్లోగానీ, ఇతర నేరాల్లోగానీ పదేళ్లపాటు బెయిల్‌పై ఉన్నవారు దేశంలో జగన్‌ తప్ప మరెవరూ లేరని శనివారం తెదేపా కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పట్టాభి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై వ్యంగ్యాస్త్రాలు, చెణుకులు, హాస్యోక్తులతో విరుచుకుపడ్డారు. ఎక్కువ కాలం బెయిల్‌పై ఉన్న వ్యక్తిగా జగన్‌ పేరును ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కించాలని కోరుతూ వారికి ఈ-మెయిల్‌ చేసినట్టు తెలిపారు. ఈ-మెయిల్‌ దరఖాస్తును మీడియాకు విడుదల చేశారు. ‘వారి నాయకుడి ఈ విజయానికి వైకాపా శ్రేణులు ఉదయంనుంచే తాడేపల్లి ప్యాలెస్‌లో సంబరాలు మొదలుపెట్టాయి. జీడిపప్పు, కిస్‌మిస్‌ దట్టించి రుచికరమైన పాయసం చేసి వచ్చిన వారందరికీ జగన్‌రెడ్డి సతీమణి భారతిరెడ్డి వడ్డిస్తున్నారని తెలిసింది. ఈ సందర్భంగా సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్‌లో ఘనమైన విందు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. పదేళ్ల బెయిల్‌ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతోనే జగన్‌రెడ్డి ముందుచూపుతో 23వ తేదీ కలసి వచ్చేలా అసెంబ్లీ సమావేశాలకు ప్లాన్‌ చేశారు. అప్పుడైతే మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, అధికారులు అందుబాటులో ఉంటారు కనుక వారితో తాను సాధించిన ఈ ఘనకార్యాన్ని పంచుకునేందుకు పక్కా ప్రణాళిక వేశారు’ అని పట్టాభి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ గుర్తిస్తుందని నమ్ముతున్నాం                 

‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు మా దరఖాస్తును ఆమోదించి అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి జగన్‌రెడ్డి సాధించిన ఈ రికార్డుకు సంబంధించిన సర్టిఫికెట్‌కు ఫ్రేమ్‌ కట్టించి ప్రదానం చేయాలని కోరుకుంటున్నా. జగన్‌రెడ్డి జీవితంలో నేటివరకు ఎక్కడా ఎలాంటి సర్టిఫికెట్లు అందుకున్న దాఖలాల్లేవు. కనీసం ఆయన విద్యార్హతలేంటో, వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకున్నారో లేదో తెలియదు. ఇప్పుడు మా ప్రయత్నం ఫలించి సర్టిఫికెట్‌ అందిస్తే.. దాన్ని జగన్‌రెడ్డి పెద్దపెద్ద ఫ్రేములు కట్టించి ఆయన ప్యాలెస్‌లు, కార్యాలయాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ పెట్టాలని సూచిస్తున్నాం. అప్పుడే దేశంలోనే అత్యధిక కాలం బెయిల్‌పై ఉన్న వ్యక్తిగా జగన్‌రెడ్డి సాధించిన ఈ ఘనత ప్రపంచమంతా తెలుస్తుంది’ అని పట్టాభి ఎద్దేవా చేశారు. ‘జగన్‌రెడ్డికి సర్టిఫికెట్‌ అందించే సమయంలో నేనూ ఆయన పక్కన నిల్చుని ఫొటో దిగాలని కోరుకుంటున్నా. ఆయనకు ఆ సర్టిఫికెట్‌ రావడంలో నా పాత్ర కూడా ఉన్నందున ఆయనే స్వయంగా నన్ను తాడేపల్లి ప్యాలెస్‌కు ఆహ్వానించి ఫొటో దిగే అవకాశం కల్పించాలని, మర్నాడు ఆ ఫొటోతో ‘సాక్షి’లో బ్యానర్‌ వార్త ప్రచురించాలని నా కోరిక’ అని పట్టాభి పేర్కొన్నారు.

జగన్‌ను అభినందిస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలి

పదేళ్ల బెయిల్‌ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్‌రెడ్డిని అభినందిస్తూ శాసనసభ, మండలిలోనూ ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టాలని తెదేపా తరఫున కోరుకుంటున్నట్టు పట్టాభి తెలిపారు. ‘మేం చేస్తున్న ఈ ప్రతిపాదనకు వైకాపావారూ మద్దతిస్తారని ఆశిస్తున్నాం. వారు తీర్మానం ప్రవేశపెడితే శాసనసభ సమావేశాల్ని బహిష్కరించిన తెదేపా సభ్యులూ హాజరవుతారు. తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించేందుకు సహకరిస్తారు. ఆ సందర్భంగా ఉభయసభల సభ్యులు నిలబడి ముఖ్యమంత్రికి అభినందనలు తెలపాలని కోరుతున్నాం’ అని పట్టాభి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘తెదేపా సభ్యుల్ని యూజ్‌లెస్‌ ఫెలోస్‌ అన్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఇప్పటికైనా మా మంచితనాన్ని గుర్తించాలి. పదేళ్లుగా న్యాయస్థానాలు, ఇతర వ్యవస్థలను ఏమారుస్తూ ఎలా బెయిల్‌పై ఉన్నారో, దానికి ఉపయోగించిన చిట్కాలేంటో నేర ప్రపంచానికి తెలియజేస్తూ జగన్‌రెడ్డి కచ్చితంగా ఒక పుస్తకం రాయాలి. అది నేర సామ్రాజ్యానికి దిక్సూచిలా ఉంటుంది’ అని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని