CM Jagan: కొంతమందికి టికెట్లు ఇవ్వలేను

‘‘అసెంబ్లీ సమావేశాలు బుధవారం ముగుస్తాయి. మర్నాటినుంచే వచ్చే ఎన్నికల కోసం పార్టీ గేర్‌ మార్చాలి’’ అని వైకాపా ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

Updated : 27 Sep 2023 13:53 IST

వచ్చే రెండు నెలలూ జనంలోనే ఉండాలి
ఇన్నాళ్లూ చేసింది ఒక ఎత్తు.. వచ్చే ఆర్నెల్లు మరో ఎత్తు
‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి’ పేరుతో కొత్త కార్యక్రమం
వైకాపా ఎమ్మెల్యేలు, నేతల సమావేశంలో సీఎం జగన్‌
సమావేశానికి దర్జాగా ఎమ్మెల్సీ అనంతబాబు

ఈనాడు, అమరావతి: ‘‘అసెంబ్లీ సమావేశాలు బుధవారం ముగుస్తాయి. మర్నాటినుంచే వచ్చే ఎన్నికల కోసం పార్టీ గేర్‌ మార్చాలి’’ అని వైకాపా ఎమ్మెల్యేలు, నేతలకు సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ‘‘ఈ నాలుగున్నరేళ్లు చేసింది ఒక ఎత్తు.. వచ్చే ఆర్నెల్లు మరో ఎత్తు. రాబోయే రెండు నెలలు జనంలోనే ఉండాలి. ఇందుకోసం అధికారికంగా ‘జగనన్న ఆరోగ్యసురక్ష’, పార్టీపరంగా ‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి’ అనే కార్యక్రమాలను ఇస్తున్నాం’’ అని చెప్పారు. వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల బాధ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో మంగళవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

సర్వేలు చివరికొచ్చాయి

‘‘నియోజకవర్గాల్లో సర్వేలు చివరికొచ్చాయి. వచ్చే రెండు నెలలు మీకు కీలకం. మీలో చాలామందికి మళ్లీ టికెట్లు రావొచ్చు.. కొందరికి టికెట్లు ఇవ్వలేకపోవచ్చు. ప్రజల్లో మీరుంటున్న తీరు, మీకున్న ఆదరణ వంటివాటిని బేరీజు వేసుకుని.. ఎన్నికల్లో తప్పులు చేయకూడదని తీసుకునే నిర్ణయాలకు సహకరించాలి. టికెట్‌ వచ్చినా రాకపోయినా మీరు నా మనుషులే. 175కి 175 స్థానాలు సాధ్యమే. క్షేత్రస్థాయిలో మనకు సానుకూల సంకేతాలు ఉన్నాయి. కాబట్టే ప్రతిపక్షాలు ఒంటరిగా రావడానికి భయపడి పొత్తుల కోసం వెతుక్కుంటున్నాయి. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే ధైర్యం, ఇదే ముందు చూపు, ప్రణాళికతో అడుగులు వేయాలి. మండల, గ్రామ స్థాయిలో నాయకులతో విభేదాలను వెంటనే పరిష్కరించుకోండి’’ అని సూచించారు.

అయిదంచెల్లో

‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి’ అనే పార్టీ కార్యక్రమాన్ని అయిదు దశల్లో నిర్వహించనున్నట్లు ఐప్యాక్‌ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్‌ ప్రజంటేషన్‌లో వివరించారు. ప్రభుత్వపరంగా చేపట్టే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ గురించి కూడా ఆయనే వివరించారు. మధ్యమధ్యలో కొన్ని అంశాలను సీఎం ప్రస్తావించారు. ‘‘వచ్చే రెండు నెలలు ఈ కార్యక్రమాలను ఎగ్రెసివ్‌గా చేపట్టాలి. వీటిలో వాలంటీర్లు, జగనన్న గృహ సారథులు అందరినీ భాగస్వాములను చేయనున్నాం. గడప గడపకు మన ప్రభుత్వంతో పాటే వీటినీ కొనసాగించాలి. నవంబరుతో గడప గడప కార్యక్రమాన్ని ముగిద్దాం. తర్వాత ఎన్నికల ప్రత్యేక కార్యాచరణ ఉంటుంది. ఆరోగ్యసురక్ష కార్యక్రమంలో ప్రతి ఇంటికీ వెళ్లి జనం ఆరోగ్యంపై జల్లెడపడతారు. ఉచితంగా పరీక్షలు, మందులతో పాటు దీర్ఘకాలిక సమస్యలున్న వారికి తర్వాత అవసరమైన వైద్య సేవలందించడం కూడా ఇందులో ఉంటుంది’’ అని జగన్‌ ప్రకటించారు.

సమావేశానికి అనంతబాబు

తనవద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న దళిత యువకుడిని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన కేసులో నిందితుడిగా జైలుకు వెళ్లి ఇప్పుడు బెయిల్‌పై ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఈ సమావేశానికి రావడం చర్చనీయాంశంగా మారింది. హత్య జరిగిన ఆరు రోజులకు అనంతబాబును వైకాపా నుంచి సస్పెండ్‌ చేశారు. అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి వద్ద సమావేశానికి ఎలా వస్తారని నేతలే చర్చించుకోవడం కనిపించింది. సాధారణంగా సీఎంఓలోకి వెళ్లడం అంత సులభం కాదు. అనంతబాబు మాత్రం దర్జాగా వెళ్లి సీఎం సమావేశంలోనూ పాల్గొన్నారు. గత నెలలో ముఖ్యమంత్రి కూనవరంలో వరద ప్రాంతాల పరిశీలనకు వెళ్లినప్పుడు నిర్వహించిన సమావేశంలోనూ సీఎంతోపాటు వేదికపై అనంతబాబు ఉన్నారు.

మండల నాయకులకు శిక్షణ

‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి’ అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై వైకాపా మండలస్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులకు అక్టోబరు 9న, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులకు 8న శిక్షణ ఉంటుంది. సచివాలయ స్థాయిలో పార్టీ కేడర్‌ అంతా ఇంటింటికీ వెళ్లి జనాన్ని కలిసి మాట్లాడతారు. జగనన్న ఆరోగ్యసురక్షను ఈ నెల 29న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 30 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ విషయాలను శాసనసభలో రాష్ట్రప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు విలేకర్లకు వెల్లడించారు.


లోకేశ్‌ కూడా అరెస్టవుతారు: మంత్రి అమర్‌నాథ్‌

‘‘మా సమావేశంలో చంద్రబాబు అరెస్టు గురించి చర్చించలేదు. ఆ విషయాలు మా పార్టీకి సంబంధించినవి కావు. దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి లోకేశ్‌ను వెళ్లి.. రాష్ట్రపతిని కాకపోతే అమెరికా అధ్యక్షుడిని కలవమనండి. ఆయన ఎవర్ని కలిస్తే మాకేం సంబంధం? చేయాల్సిన తప్పులు చేసి, డబ్బు కొట్టేసి, వాళ్లను, వీళ్లను కలుస్తామంటే ఉపయోగం లేదు. లోకేశ్‌ను కూడా ఒక కేసులో ఏ-12గానో 13గానో చేర్చారు. ఆయన్ను కూడా అరెస్టు చేసే పరిస్థితి కనిపిస్తోంది’’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని