నెమ్మదించినా.. సంప్రదింపులు ఆగలేదు

విపక్ష ఇండియా కూటమి కార్యకలాపాలు నెమ్మదించిన మాట వాస్తవమే అయినప్పటికీ పూర్తిగా నిలిచిపోలేదని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. కూటమిలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కారం కోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది.

Published : 03 Oct 2023 04:31 IST

చిక్కుముళ్లు తొలగించే యత్నం జరుగుతోంది  
ఇండియా కూటమికి ఎదురవుతున్న సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు

విపక్ష ఇండియా కూటమి కార్యకలాపాలు నెమ్మదించిన మాట వాస్తవమే అయినప్పటికీ పూర్తిగా నిలిచిపోలేదని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. కూటమిలో కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కారం కోసం చర్చలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించింది. ఉమ్మడి సమావేశాలు నిర్వహించకున్నా.. తెరవెనుక సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయని స్పష్టం చేసింది. ఇండియా కూటమి తలపెట్టిన భోపాల్‌ ర్యాలీ రద్దయింది. అంతేగాక సంయుక్త సమావేశాలు, కార్యక్రమాలూ నిర్వహించడం లేదు. ఈ పరిస్థితుల్లో భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీట్ల పంపకంలో పార్టీల మధ్య సయోధ్య కుదరలేదా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీటిపై కూటమిలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌ స్పందించింది. ఇండియా కూటమిలో కొన్ని సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని.. వాటిని పరిష్కరించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని ఏఐసీసీ సమన్వయ కర్త సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌ ‘ఈటీవీ భారత్‌’కు చెప్పారు.

రాష్ట్రాల స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి

‘మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వంటి వాళ్లు త్వరలో ఎన్నికలు జరుగబోయే రాష్ట్రాల్లో ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఆయా రాష్ట్రాల నాయకత్వం కూడా ఎన్నికల పనుల్లో విశ్రాంతి లేకుండా ఉంది. ఈ కారణంగా ఇండియా కూటమి నెమ్మదించిందని అనుకోలేం. సీనియర్‌ నాయకులు లేనంత మాత్రాన సమాంతర సమావేశాలు నిర్వహించలేమని కాదు. సీట్ల పంపకం గురించి, సోషల్‌ మీడియా వ్యూహాలు, ఉమ్మడి ప్రచారాలు వంటి అంశాలపై తెరవెనుక సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇండియా కూటమి ఒక పార్టీతో కేంద్రీకృతం కానందున.. ఇలాంటి సంప్రదింపులు ఎక్కువగా రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. గత నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా దిల్లీలో అనేక సంప్రదింపులు జరిగాయి’ అని ఏఐసీసీ సమన్వయకర్త సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌ తెలిపారు. ‘ఇండియా కూటమి నాయకులు ఒక నిర్దిష్ట నగరంలో లేరు. దీనివల్ల వారు మీడియాతో కలిసి మాట్లాడలేకపోతున్నారు. అంత మాత్రాన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని కాదు. ఫోన్‌, కాన్ఫరెన్స్‌ కాల్స్‌, జూమ్‌ సమావేశాల ద్వారా చాలా సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రతి సమాచారం మీడియాకు తెలియాలని లేదు. చర్చలు పూర్తైన తర్వాత మేము కచ్చితంగా అధికారిక ప్రకటన చేస్తాం’ అని ఏఐసీసీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి సుప్రియా శ్రినేత్‌ ‘ఈటీవీ భారత్‌’కు వివరించారు.


వనరులు చాలడం లేదు!

‘బహిరంగ సభ ప్లాన్‌ చేస్తే లక్ష నుంచి రెండు లక్షల మందిని సమీకరించాలి. అలాంటి సమయంలో మన వద్ద ఉన్న వనరుల అంశం ప్రస్తావనకు వస్తుంది. వనరులు లేనప్పుడు ఉమ్మడి ర్యాలీని ఎవరు నిర్వహిస్తారు. దీంతో పాటు సీనియర్‌ నేతలు కూడా అందుబాటులో ఉండేటట్టు కసరత్తు చేయాలి. అయితే, ఈ నెలలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’ అని ఏఐసీసీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఇండియా కూటమిలో సీట్ల పంపకం విషయంలో కొన్ని సమస్యలు ఉన్నట్లు ఆయన చెప్పారు. వాటిని పరిష్కరించి ఏకాభిప్రాయాన్ని సాధించాలని.. ఇంకా ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగించుకోవాలని కూటమి ప్రయత్నిస్తోందని చెప్పారు. బిహార్‌లో ఉన్న 40 లోక్‌సభ స్థానాల్లో సీట్ల పంపకాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌లు పర్యవేక్షిస్తున్నారు. 80 సీట్లు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆ బాధ్యత సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తీసుకున్నారు. 48 సీట్లు ఉన్న మహారాష్ట్రలో సామరస్య పంపిణీకి ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్‌, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే కృషి చేస్తున్నారు. ఈ పనిని సమన్వయ కమిటీ పర్యవేక్షిస్తుండటం వల్ల కూటమికి ఛైర్‌పర్సన్‌, కన్వీనర్‌ను నియమించడం ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఈ కూటమికి ప్రధాన కార్యాలయం కూడా ఇంకా ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయం కూటమికి సహాయం అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు