తిరుగుబాటు ఎమ్మెల్యేలకు భారీ ఊరట
మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. సోమవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన ఏక్నాథ్ శిందే వర్గ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర
అనర్హత నోటీసులపై సమాధానమిచ్చేందుకు గడువు పెంచిన సుప్రీంకోర్టు
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు
దిల్లీ: మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. సోమవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన ఏక్నాథ్ శిందే వర్గ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర శాసనసభ ఉపసభాపతి జారీ చేసిన అనర్హత నోటీసులకు సమాధానమిచ్చేందుకు సోమవారం (జూన్ 27)తో ముగియనున్న గడువును జులై 12 వరకు పొడిగించింది. ఇది ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి ఒకరకంగా ఎదురుదెబ్బే. ఉపసభాపతి అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ శిందే.. మరో 15 మంది ఎమ్మెల్యేలు వేసిన వ్యాజ్యాన్ని సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పర్దీవాలా ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా, 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారి కుటుంబస భ్యులకు ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో తదుపరి విచారణను జులై 11కు వాయిదా వేస్తూ, ఉపసభాపతి, మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు.. న్యాయమూర్తులు నోటీసులు జారీ చేశారు. అయితే శాసనసభలో బలపరీక్ష నిర్వహించకుండా ఆదేశాలివ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన వ్యాజ్యంపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు మాత్రం ధర్మాసనం నిరాకరించింది.
బాల్ఠాక్రే హిందూత్వానికి లభించిన విజయమిది: శిందే
సుప్రీంకోర్టు తీర్పుపై శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే స్పందించారు. ఇది హిందూ హృదయ సమ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే అనుసరించిన హిందూత్వవాదానికి, తాను మార్గదర్శిగా భావించే దివంగత ఆనంద్ దిఘే ఆలోచనలకు లభించిన విజయంగా పేర్కొన్నారు.
అసమ్మతులపై మహారాష్ట్ర సీఎం వేటు
ముంబయి, గువాహటి: అసమ్మతి శిబిరంలో చేరడానికి గువాహటి వెళ్లిన తొమ్మిది మంది మంత్రులపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కన్నెర్ర చేశారు. ఇప్పటివరకు వారు చూస్తున్న శాఖలను ‘పరిపాలన సౌలభ్యం’ పేరిట వేరే మంత్రులకు కేటాయించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర శాసనసభ నుంచి అందిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సోమవారంతో ముగిసిన గడువును సుప్రీంకోర్టు రెండు వారాలు పొడిగించింది. ముంబయి అభివృద్ధి పనుల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ‘నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం’ (పీఎంఎల్ఏ) కింద శివసేన ముఖ్యనేత, ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ పరిణామాలతో ఇటు ముంబయిలో, అటు గువాహటిలో రాజకీయం మరింత వేడెక్కింది.
తెరవెనక ఉన్నది కమలనాథులే
మంత్రి ఏక్నాథ్ శిందే వెంట 9 మంది మంత్రులు వెళ్లిపోవడంతో శివసేనకు సీఎం సహా నలుగురు మంత్రులే మిగిలారు. శిందే చూస్తున్న పట్టణాభివృద్ధి, ప్రభుత్వరంగ సంస్థల శాఖను పరిశ్రమల మంత్రి సుభాష్ దేశాయ్కు అప్పగించారు. రెబల్ శాసనసభ్యులకు కేంద్రం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై శివసేన మండిపడింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని తెరవెనుక నుంచి నడిపిస్తున్నది భాజపాయేననేది ఈ చర్యతో రుజువైందని, ఆ పార్టీ ముసుగు తొలగిపోయిందని పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయం దుమ్మెత్తిపోసింది. రెబల్ శాసనసభ్యులను ఆబోతులతో పోల్చింది. వారు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించింది. అసమ్మతి అనేది శివసేన అంతర్గత వ్యవహారమని ఒకపక్క చెబుతూనే మరోపక్క ఏక్నాథ్ శిందే, విపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్లు కేంద్ర హోం మంత్రి అమిత్షా సమక్షంలో వడోదరాలో భేటీ అయ్యారని తెలిపింది. కేంద్రంలో, రాష్ట్రంలో భాజపా మొత్తం స్క్రిప్టు రాసి, తిరుగుబాటు ఎమ్మెల్యేలను నటులుగా మార్చి, వారిచేత మొత్తం కథ నడిపిస్తోందని ఆరోపించింది.
‘అశాంతి రేకెత్తించడానికి ఏక్నాథ్ యత్నం’
తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నేతృత్వం వహించడం ద్వారా మహారాష్ట్రలో అశాంతిని, రాజకీయ కల్లోలాన్ని రేకెత్తించడానికి ఏక్నాథ్ శిందే ప్రయత్నిస్తున్నారని, బాధ్యతల్ని విస్మరిస్తూ, నైతికంగా తప్పులకు పాల్పడుతున్నవారందరిపై తగిన చర్య తీసుకోవాలని కోరుతూ సోమవారం బొంబాయి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అనేకమంది మంత్రులు రాష్ట్రంలో లేని సమయంలో పాలన ఎలా నడుస్తోందో తెలిపే సవివర ప్రణాళికను సమర్పించాల్సిందిగా మహా వికాస్ అఘాడీ సర్కారును ఆదేశించాలని పిల్ను దాఖలు చేసిన ఏడుగురు పౌరులు కోరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాష్ట్రానికి రావాలంటూ ఆదేశించాలని, అత్యవసర విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనాన్ని వారు అభ్యర్థించారు. విచారణకు తేదీ నిర్ణయిస్తామని ధర్మాసనం తెలిపింది.
ఎక్కడ పోరాటానికైనా సిద్ధమే: రౌత్
సర్కారు విషయంలో వీధుల్లో, న్యాయస్థానాల్లో ఎక్కడ పోరాటం చేయడానికైనా తాము సిద్ధమేనని ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. గువాహటికి వెళ్లిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పుడు ‘జీవం లేని దేహాల’తో సమానమని వ్యాఖ్యానించారు. వారి మనస్సాక్షి చచ్చిపోయిందన్నారు. శాసనసభలోనే నిజమైన పరీక్ష జరుగుతుందని చెప్పారు.
‘మీరు ప్రజాగ్రహానికి అడ్డుకట్ట వేయలేరు. పోలీసులు, చట్టాలు ఆ ఆగ్రహాన్ని ఆపలేవనే మీరు భాజపా బానిసలుగా మారిపోయి రక్షణ పొందారు’ అని తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన అన్నారు. మహారాష్ట్రలో పలుచోట్ల శివసేన కార్యకర్తల నిరసనలు కొనసాగాయి. ప్రభుత్వంలోనైనా, విపక్షంలోనైనా ఠాక్రేతోనే ఎంవీఏ కూటమి ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ చెప్పారు. మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) వ్యవస్థాపకుడు రాజ్ ఠాక్రేతో ఏక్నాథ్ శిందే ఫోన్లో చర్చించినట్లు ఎంఎన్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
గువాహటి హోటల్ వద్ద ఆంక్షలు
గువాహటిలో శివసేన ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. న్యాయవాదులు, సీనియర్ అధికారులు అక్కడ కనిపిస్తున్నారు. అస్సాం ప్రభుత్వ వాహనాలు కూడా లోపలకు రాకపోకలు సాగిస్తున్నాయి. హోటల్కు రాకపోకలు చేస్తున్నవారి పేర్లను పోలీసులు నమోదు చేస్తున్నారు. సిబ్బందిని కూడా గుర్తింపు పత్రాలు తనిఖీ తర్వాతే లోపలకు పంపిస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో 15-20 మంది తనతో మాట్లాడుతున్నారని, గువాహటి నుంచి ముంబయికి తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నారని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే చెప్పారు.
ఆ ఉత్తర్వులపై వివరాలివ్వండి: గవర్నర్
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం వేళ ఈ నెల 22 నుంచి 24 వరకు ప్రభుత్వం వెలువరించిన అన్ని ఆదేశాలు, ఉత్తర్వుల వివరాలను పూర్తిస్థాయిలో తనకు సమర్పించాలని గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ