Andhra News: ఈ నాయకులకో దండం.. ఎందుకు అవమానిస్తున్నారు?: పలాస మున్సిపల్‌ ఛైర్మన్‌

‘ఈ నాయకులకో దండం.. అవసరమైతే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ అధ్యక్షుడు బి.గిరిబాబు వైకాపా ప్లీనరీ నుంచి

Updated : 01 Jul 2022 08:14 IST

నియోజకవర్గ ప్లీనరీ నుంచి నిష్క్రమణ

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: ‘ఈ నాయకులకో దండం.. అవసరమైతే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘ అధ్యక్షుడు బి.గిరిబాబు వైకాపా ప్లీనరీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలోని జీఎంఈ కాలనీలో గురువారం నియోజకవర్గ స్థాయి వైకాపా ప్లీనరీని మంత్రి సీదిరి అప్పలరాజు అధ్యక్షతన నిర్వహించారు. వేదికపై మంత్రితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాసు, జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ, డీసీసీబీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు, పార్టీ సీనియర్‌ నాయకుడు హెచ్‌.వెంకటరావు ఆశీనులయ్యారు. అతిథులను మాత్రమే వేదికపైకి పిలిచామని మిగిలిన వారంతా దిగువన కూర్చోవాలని ఆహ్వానం పలికిన పార్టీ పలాస మండల అధ్యక్షుడు పైల వెంకటరావు పేర్కొన్నారు. దీంతో మున్సిపల్‌ ఛైర్మన్‌ బి.గిరిబాబు కార్యకర్తల మధ్యలో కూర్చున్నారు. కొద్ది సేపటి తర్వాత గిరిబాబు వేదిక పైకి వచ్చి మాట్లాడాలని పైల వెంకటరావు పలు మార్లు పిలిచినా ఆయన వెళ్లలేదు. పార్టీ సీనియర్‌ నాయకుడు హెచ్‌.వెంకటరావు ఆయన వద్దకు వచ్చి పిలిచారు. ‘సమావేశం ఎవరు నిర్వహిస్తున్నారు.. ఎజెండా ఏమిటి.. వేదికపైకి పిలవకుండా నన్ను ఎందుకు అవమానించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కనీస గౌరవం ఇవ్వడం లేదు.. ఈ పదవులు నాకొద్దు.. అవసరమైతే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తాను’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆయనతో పాటు అనుచరులు సైతం వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని