తెరాస బైక్ ర్యాలీ శాంపిల్ మాత్రమే
ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, భాజపా ముఖ్య నేతలు నగరానికి పర్యాటకుల్లా వచ్చారని, ఆదర్శ నగరమైన హైదరాబాద్ అందాలు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని....
భాజపాను ఉద్దేశించి మంత్రి తలసాని వ్యాఖ్య
బేగంపేట, న్యూస్టుడే: ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, భాజపా ముఖ్య నేతలు నగరానికి పర్యాటకుల్లా వచ్చారని, ఆదర్శ నగరమైన హైదరాబాద్ అందాలు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి నేర్చుకుని వెళ్తారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వ్యాఖ్యానించారు. తెరాస బైక్ ర్యాలీ భాజపాకు చిన్న శాంపిల్ మాత్రమే అన్నారు. బేగంపేట విమానాశ్రయంలో శనివారం ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మోదీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు రాలేదనే ప్రశ్నకు తలసాని స్పందిస్తూ మర్యాద ఇచ్చిపుచ్చుకునే ధోరణిని బట్టి ఉంటుందన్నారు. భారత్ బయోటెక్ను సందర్శించేందుకు ప్రధాని మోదీ వచ్చిన సమయంలో ముఖ్యమంత్రిని ఎందుకు వద్దన్నారని ప్రశ్నించారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రే రానవసరం లేదని, కేబినెట్ నుంచి ఎవరు వచ్చినా సరిపోతుందని చెప్పారు. ప్రధాని వచ్చిన సమయంలోనే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన్హా నగరానికి రావడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ 2న వస్తానని సిన్హా అంతకుముందే తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. భాజపా వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్పై ఓ క్యాప్షన్ కూడా పెట్టారన్నారు. అందుకు తాము కూడా ‘బై బై మోదీ’ అనే నినాదాన్ని తెరపైకి తేవాల్సి వచ్చిందన్నారు. ఈడీ, ఇన్కంటాక్స్ విభాగం, సీబీఐలతో భయపెడుతూ కేంద్రం వ్యవస్థలను నాశనం చేస్తోందని ఆరోపించారు. అనైతిక పొత్తులతో ప్రభుత్వాలను కూలదోస్తున్నారని విమర్శించారు. తమకు కేసీఆరే శ్రీరామరక్ష అని తెలంగాణ సమాజం కోరుకుంటోందన్నారు. తాము ఎవరికీ భయపడేది లేదని చెప్పారు. ‘మా ఇల్లు వారికి ఎంత దూరమో, వారిల్లు కూడా మాకు అంతే దూరం’ అని గ్రహించాలన్నారు. దేశప్రజలు ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నారని, అందుకు తామూ సిద్ధంగానే ఉన్నామని తలసాని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.