శిందేకు ముందస్తు విజయం
శివసేన అసమ్మతి వర్గం ఆదివారం మహారాష్ట్ర శాసనసభాపతి ఎన్నికల్లో విజయం సాధించింది. రెండ్రోజుల పాటు జరిగే ప్రత్యేక సమావేశాలు మొదలైన తొలిరోజు స్పీకర్ ఎన్నికను చేపట్టగా భాజపా అభ్యర్థి రాహుల్ నర్వేకర్ 164 ఓట్లు సాధించి నెగ్గారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన
స్పీకర్ ఎన్నికలో భాజపా అభ్యర్థి నర్వేకర్ గెలుపు
ఒక సభకు సారథిగా మామ.. రెండో సభకు అల్లుడు
నేటి విశ్వాస పరీక్ష నల్లేరుపై నడకేనని ధీమా
ముంబయి: శివసేన అసమ్మతి వర్గం ఆదివారం మహారాష్ట్ర శాసనసభాపతి ఎన్నికల్లో విజయం సాధించింది. రెండ్రోజుల పాటు జరిగే ప్రత్యేక సమావేశాలు మొదలైన తొలిరోజు స్పీకర్ ఎన్నికను చేపట్టగా భాజపా అభ్యర్థి రాహుల్ నర్వేకర్ 164 ఓట్లు సాధించి నెగ్గారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అభ్యర్థి రాజన్ సాల్వీ 107 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. దీనిని బట్టి 287 మంది సభ్యులున్న సభలో బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో తెలిసిపోతోంది. సోమవారం జరగబోయే విశ్వాస పరీక్షలోనూ ఫలితం ఇలాగే ఉంటుందని, స్పీకర్ ఎన్నికలోనే ముందస్తు విజయం లభించిందని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం ఉత్సాహంతో ఉంది. కాంగ్రెస్కు చెందిన నానా పటోలే రాజీనామా చేయడంతో సభాపతి స్థానం గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉంది. నూతన సభాపతి నర్వేకర్ (45) దేశంలోనే అతిపిన్న వయస్కుడైన స్పీకర్గా నిలుస్తారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చెప్పారు. నూతన సభాపతి మామ రామ్రాజే నాయక్ (ఎన్సీపీ) మహారాష్ట్ర శాసనమండలికి ఛైర్పర్సన్గా ఉన్నారు. 288 స్థానాలున్న శాసనసభలో ప్రస్తుతం 287 మంది ఎమ్మెల్యేలున్నారు. స్పీకర్ ఎన్నికల్లో శివసేన ఎమ్మెల్యేల్లో కొంతమంది పార్టీ విప్ను ధిక్కరించారనీ, రికార్డులను పరిశీలించి తగిన చర్య తీసుకుంటామని ఉప సభాపతి నర్హరి జిర్వాల్ తెలిపారు. 271 మంది ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. సమావేశం ప్రారంభానికి ముందే శాసనసభ ప్రాంగణంలోని శాసనసభాపక్ష కార్యాలయానికి శివసేన చీలికవర్గం తాళాలు వేసింది. స్పీకర్ ఎన్నికలో తాము సూచించిన అభ్యర్థికే ఓటు వేయాలంటూ శివసేనలోని రెండు వర్గాలు వేర్వేరుగా విప్లు జారీ చేశాయి. ఠాక్రే నేతృత్వంలోని 16 మంది ఎమ్మెల్యేలు భాజపా అభ్యర్థికి ఓటు వేయలేదని బయటపడింది. తాము చెప్పిన రీతిలో 39 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయలేదని ఠాక్రే వర్గానికి చెందిన శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు ఫిర్యాదు చేశారు.
శాసనసభాపక్ష నేతగా శిందే పునర్నియామకం
ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం మరికొన్ని గంటల్లో చర్చకు రానుండగా నూతన సభాపతి నర్వేకర్ ఆదివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన శాసనసభాపక్ష నేతగా ఉన్న అజయ్ చౌధరిని తొలగించి, ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందేను తిరిగి నియమించారు. చీఫ్ విప్ పదవిలోనూ శిందే వర్గ ఎమ్మెల్యేను నియమించారు. ఇది ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్దదెబ్బగా భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్