Chandrababu: పాలకొల్లు ఘటనపై విచారణ జరపండి

ఏలూరు జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌లను వైకాపా శ్రేణులు అడ్డుకోవడం

Updated : 07 Aug 2022 06:33 IST

డీజీపీకి చంద్రబాబు లేఖ

తెదేపా ప్రజాప్రతినిధులపై దాడికి ఖండన

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఏలూరు జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌లను వైకాపా శ్రేణులు అడ్డుకోవడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను వేదికపైకి వెళ్లనీయకుండా వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడిన సమయంలో అక్కడే ఉన్న డీఎస్పీ, ఐదుగురు ఎస్సెలు సహా ఏ ఒక్క పోలీసూ స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి చంద్రబాబు శనివారం లేఖ రాశారు. ‘పాలకొల్లులోని పెంకులపాడులో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో వైకాపా గూండాలు అమానుషంగా వ్యవహరించారు. స్థానిక ఎమ్మెల్యే అని చూడకుండా రామానాయుడిపై దాడిచేశారు. వేదిక పైనుంచి ఆయన్ను కిందికి తోసేయడంతో గాయాలయ్యాయి.  పోలీసుల సమక్షంలోనే ప్రజాప్రతినిధులకు రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితేంటి? దాడికి పాల్పడ్డ వైకాపా నాయకులపై, అడ్డుకోకుండా అలసత్వం ప్రదర్శించిన పోలీసులపై సమగ్ర విచారణ జరపాలి. పోలీసులు సమర్థంగా, నిజాయతీగా పని చేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దాడికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను లేఖకు జత చేశారు.

తెదేపా సామాజిక మాధ్యమ ఖాతాల డీపీగా జాతీయ పతాకం: తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సామాజిక మాధ్యమ ఖాతాల డీపీగా జాతీయ పతాకాన్ని ఉంచినట్లు ఆ పార్టీ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని