మహిళలు మా పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు

అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను ఎవరూ పట్టించుకోరని, మహిళలు తమ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.. మాధవ్‌ వీడియో గనుక నిజమైతే

Published : 12 Aug 2022 05:10 IST

అనంతపురం ఎస్పీని ఎవరూ పట్టించుకోరు

ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను ఎవరూ పట్టించుకోరని, మహిళలు తమ పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.. మాధవ్‌ వీడియో గనుక నిజమైతే పార్లమెంట్‌ సభ్యులకు అది మాయని మచ్చేనని ఆయన అన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏకచిత్ర నటుడైన ఒక ఎంపీ, ఆ శాఖకు సంబంధించిన మంత్రి, నగ్న వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయిస్తామని చెప్పారని, ఎస్పీ మాత్రం ఒరిజినల్‌ వీడియో కావాలంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పుడు విశాఖలోని హయగ్రీవ ఫౌండేషన్‌కు 2007, 08లో వృద్ధాశ్రమం నిర్మాణానికి 13.80 ఎకరాల స్థలం కేటాయించారని ఆయన తెలిపారు. ఆ భూమిలో 20 శాతం స్థలంలో వృద్ధాశ్రమం నిర్మించి, మిగతా స్థలంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి వృద్ధులకు ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించారని చెప్పారు. వృద్ధాశ్రమం నిర్మించకపోవడంతో ప్రభుత్వం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించిందన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎంపీతో పాటు వెంకటేశ్వరరావు అనే మరో వ్యక్తీ కలిసి వెయ్యి గజాల చొప్పున ప్లాట్లుగా చేసి 31 బిట్లను విక్రయించారని ఆరోపించారు. హయగ్రీవ ఫౌండేషన్‌కు ప్రభుత్వం స్థలం ఇచ్చిన ఉద్దేశం ఒకటైతే అక్కడ చోటుచేసుకుంటున్న కార్యకలాపాలు మరొకటని పేర్కొంటూ కలెక్టర్‌ మల్లికార్జున్‌ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం ఆ ఫౌండేషన్‌కు ఇచ్చిన భూ కేటాయింపును రద్దు చేయాలన్నారు. అయితే కలెక్టర్‌ నివేదికను తమ పార్టీకి చెందినవారు పక్కన పెట్టారని రఘురామ ఆరోపించారు. హయాగ్రీవ ఫౌండేషన్‌కు కేటాయించిన భూమి విలువ రూ.500 కోట్లు ఉంటుందన్నారు. ఆ భూమిని ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి సొంత చెల్లెలిని కాదని ఎవరితోనో రాఖీ కట్టించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని