నాపై విష ప్రచారం ఆపండి

పత్రికలు, టీవీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో కరవు కాటకాలపై చర్చ పెట్టాలి, కానీ ఓ ఫేక్‌ వీడియో, మార్ఫింగ్‌ చేసిన వీడియోపై చర్చ పెట్టడం పద్ధతి

Published : 15 Aug 2022 04:58 IST

ఇప్పటికైనా దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌

డోన్‌, అనంతపురం (మూడోరోడ్డు), న్యూస్‌టుడే: పత్రికలు, టీవీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్రంలో కరవు కాటకాలపై చర్చ పెట్టాలి, కానీ ఓ ఫేక్‌ వీడియో, మార్ఫింగ్‌ చేసిన వీడియోపై చర్చ పెట్టడం పద్ధతి కాదని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. తప్పుడు వీడియోలపై అనవసరం రాద్ధాంతం కూడదని.. ఇప్పటికైనా దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఎంపీ అని కూడా చూడకుండా ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా తనపై విష ప్రచారం ఆపేయాలని కోరారు. ఆదివారం ఆయన డోన్‌లోనూ, అనంతరం అనంతపురంలోని తన నివాసంలోనూ విలేకర్లతో మాట్లాడుతూ.. ఆ వీడియోను పరీక్షలకు పంపి నిజాలు తేల్చాలని తాము పోలీసులను కోరామన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీల గొంతు మీద కత్తిలాగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అమెరికాలో పరీక్షకు పంపామని, అక్కడ సర్టిఫికెట్‌ ఇచ్చారంటూ కొత్త విషయాలకు తెర మీదకు తెస్తున్నారన్నారు. గోరంట్ల మాధవ్‌ కోసమో, చంద్రబాబు కోసమో పోలీస్‌ వ్యవస్థ లేదని పేర్కొన్నారు. కొందరు తామే ఖాకీ దుస్తులు వేసుకున్నట్లుగా, ఫోరెన్సిక్‌ నిపుణుల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు.

ఉరిశిక్ష ఒక్కటే వేయలేదు..  
తాను ఒక సామాజికవర్గానికి వ్యతిరేకం కాదని ఎంపీ మాధవ్‌ పేర్కొన్నారు. మార్ఫింగ్‌ చేసిన వీడియో యూకే నుంచి తెదేపా ఐటీడీపీ గ్రూపులో అప్‌లోడ్‌ అయ్యిందని, తర్వాత దానిని రెండు ఛానళ్లు ప్రసారం చేశాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై నిజనిజాలు తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేయించినట్లు తెలిపారు. పోలీసులు అది నిజమైన వీడియో కాదని ప్రాథమికంగా చెప్పినా.. కొన్ని టీవీ ఛానళ్లు పనిగట్టుకొని చర్చావేదికలు నిర్వహించాయని పేర్కొన్నారు. ‘వారే సొంతంగా విచారణ చేశారు.. నల్లగౌను వేసుకొని ఉరిశిక్ష ఒక్కటే వేయలేదు’ అని అన్నారు. ఆయన వెంట మాదాసి, మాదారి కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సోమలింగడు, శివలింగం, కోశాధికారి కేసీ మద్దిలేటి, రాష్ట్ర నాయకులు రంగనాథం, లక్ష్మన్న, బీసీ సంఘం నాయకులు భాస్కర్‌నాయుడు, ప్రకాశ్‌, ఆనంద్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని