Kodali Nani: ‘ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ వేధిస్తున్నారు’

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ.. తనను వేధిస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన వార్డు వాలంటీర్‌ మేరుగు లలిత ఆరోపించారు. దీనిపై ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌తోపాటు పలువురికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.

Updated : 16 Sep 2022 07:56 IST

వార్డు వాలంటీర్‌ ఆరోపణ

గాంధీనగర్‌ (విజయవాడ), న్యూస్‌టుడే: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ.. తనను వేధిస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన వార్డు వాలంటీర్‌ మేరుగు లలిత ఆరోపించారు. దీనిపై ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌తోపాటు పలువురికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. గురువారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘మేం గుడివాడ బాపూజీనగర్‌ 13వ వార్డులో నివసిస్తున్నాం. తిరుపతమ్మ చెరువు గట్టున మున్సిపాలిటీ స్థలంలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. మూడు రోజుల క్రితం బోరు వేసేందుకు కూలీలు పని చేస్తుండగా.. రోడ్డు అవతలివైపు ఉన్న రమేష్‌, సురేష్‌ వచ్చి మా సామాన్లు చెల్లాచెదురుగా పడేశారు. నాపై దాడి చేశారు. వాళ్లకు భయపడి అక్కడి నుంచి పారిపోయాను. తర్వాత వారిద్దరితోపాటు సురేష్‌ మామ సుబ్రహ్మణ్యం వచ్చారు. ముగ్గురూ కలిసి నన్ను కులం పేరుతో దూషించి అసభ్యంగా ప్రవర్తించారు. చుట్టుపక్కల వాళ్లు రావడంతో పారిపోయారు. డయల్‌ 100కు ఫోన్‌ చేయగా.. పోలీసులు వచ్చి వివరాలు తీసుకున్నారు. సాయంత్రం సీఐ దుర్గారావు పిలిపించారు. జరిగిందంతా ఆయనకు చెప్పాను. వెంటనే బోరు పనులు ఆపేయాలని, లేకపోతే తిరిగి నీపైనే కేసు పెట్టాల్సి వస్తుందని సీఐ అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని పీఏ లక్ష్మోజీ దగ్గరకు వెళ్లగా.. నాతో అసభ్యంగా మాట్లాడారు. లక్ష్మోజీ తన బంధువులైన రమేష్‌, సురేష్‌లకు అండగా ఉంటూ.. నన్ను బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా’ అని లలిత ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని