అమరావతి రైతుల పాదయాత్రకు అండగా ఉంటాం: సత్యకుమార్‌

‘అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారు.. ఆ పాదయాత్రకు మద్దతిస్తాం. కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అంటూ భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

Published : 26 Sep 2022 04:49 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ‘అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారు.. ఆ పాదయాత్రకు మద్దతిస్తాం. కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అంటూ భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ భరోసా ఇచ్చారు. ఆదివారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అబద్ధాలు మాట్లాడారని చెప్పారు. ప్రజల దృష్టి మరల్చడానికి ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చారని విమర్శించారు. ‘కొత్తగా మంత్రులు రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారా? ఏదైనా ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా’ అని ప్రశ్నించారు. ఏయూ ఉపకులపతి రాజకీయాలు చేస్తున్నారని.. ఆయనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.వి.ఎన్‌.మాధవ్‌, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని