ఎన్టీఆర్‌ పేరు తొలగింపు సరికాదు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడాన్ని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తప్పుపట్టారు. అది మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ....

Published : 27 Sep 2022 04:34 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్య

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడాన్ని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తప్పుపట్టారు. అది మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘మహానుభావుల పేర్లను తొలగించడం మంచిదికాదు. ఇది కొత్త సంప్రదాయం. మొగలులు, బ్రిటిష్‌వాళ్ల పేర్లను తీసేయడం వేరు. మనవాళ్ల పేర్లను తొలగించడం సరికాదు. ఎన్టీఆర్‌ అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడు’ అని పేర్కొన్నారు. మంగళవారం కేంద్ర హోంశాఖ విభజన సమస్యలపై ఏపీ, తెలంగాణ అధికారులతో సమావేశం అవుతున్న విషయం గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సమస్యలను రెండు రాష్ట్రాలూ కూర్చొని పరిష్కరించుకోవాలన్నారు. ‘కృష్ణా, గోదావరి జలాల సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేస్తే ఇద్దరికీ నచ్చలేదు. బకాయిలను పరిష్కరించుకోవాలని ఉత్తరాలు రాస్తే మేమెందుకు ఇస్తాం, వాళ్లే మాకు ఇవ్వాలని చెబుతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి భోజనం చేసినప్పుడు.. అపరిష్కృత సమస్యలు పరిష్కరించుకుంటే తప్పేముంది?’ అని ప్రశ్నించారు. వారు ముందుకు రానప్పుడు మీరే పరిష్కరించవచ్చుకదా? అనే ప్రశ్నకు బదులిస్తూ ‘కృష్ణా, గోదావరి జలాల సమస్యను మేమే పరిష్కరించాం’ అన్నారు. వైజాగ్‌ రైల్వే జోన్‌ గురించి అడిగిన ప్రశ్నకు.. అది ఎక్కడ ఆగిందో తెలుసుకొని చెబుతానని కిషన్‌రెడ్డి అన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు గురించి తనకు తెలియదని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.2,000 కోట్ల రుణం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడించారు. సెయిల్‌లో విలీనం చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయని, అయితే దానిపై ఇప్పటివరకు చర్చ జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని