ప్రతిష్ఠాత్మకం.. ప్రయోజనకరం!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా సాగేలా చూడటంతోపాటు ఎన్నికల ముంగిట రాజకీయంగానూ సద్వినియోగం చేసుకోవడంపై పీసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో

Published : 30 Sep 2022 04:28 IST

 రాష్ట్రంలో రాహుల్‌ పాదయాత్రపై పీసీసీ కార్యాచరణ

నేడు కీలక సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా సాగేలా చూడటంతోపాటు ఎన్నికల ముంగిట రాజకీయంగానూ సద్వినియోగం చేసుకోవడంపై పీసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో యాత్ర రూట్‌మ్యాప్‌ను ప్రాథమికంగా ఖరారు చేసినా.. మార్పులతో మరింత ప్రయోజనకరంగా మార్చేదిశగా రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి, ఇక్కడి నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించే ప్రాంతాల్లో ఎలాంటి మార్పులైనా చేసుకోవచ్చని ఏఐసీసీ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు చేపట్టారు. ప్రధానంగా వీలైనన్ని ఎక్కువ గ్రామాలు, పట్టణాల్లో పాదయాత్ర ఉండేలా చూడనున్నారు. ప్రతి సందర్భంలోనూ కనీసం పదివేల మంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ వర్గాల ముఖ్యులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. పాదయాత్ర రాష్ట్రంలో కొనసాగుతున్న సమయంలోనే సోనియాగాంధీ లేదా   ప్రియాంకగాంధీ రాష్ట్రానికి వచ్చేలా చూడాలని పీసీసీ భావిస్తోంది. అక్టోబరు 24న రాష్ట్రంలో ప్రవేశించే పాదయాత్ర 15 రోజులపాటు ఇక్కడ సాగనుంది.

ఓఆర్‌ఆర్‌పై కాకుండా గ్రామాల మీదుగా

శంషాబాద్‌ నుంచి ముత్తంగి వరకు పాదయాత్రను ఓఆర్‌ఆర్‌ మీదుగా చేపట్టాలని గతంలో నిర్ణయించినా ఇప్పుడు దీన్ని పూర్తిగా మారుస్తున్నారు. రింగ్‌ రోడ్డు పక్క నుంచి వివిధ గ్రామాల మీదుగా చేపట్టేలా మార్పులు చేస్తున్నారు. 15 రోజులపాటు రాష్ట్ర కాంగ్రెస్‌ కీలక నేతలంతా జోడోయాత్రలో భాగస్వాములు కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా ముఖ్యనేతలు, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు పాదయాత్ర కార్యక్రమాల ఖరారుపై చర్చిస్తున్నారు. రాహుల్‌గాంధీ యాత్రను విజయవంతం చేయడమే లక్ష్యంగా శుక్రవారం గాంధీభవన్‌లో పీసీసీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఈ భేటీలో ఏఐసీసీ ఇన్‌ఛార్జులతోపాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. వసతి, జనసమీకరణ సహా సమావేశాలు, సభలను ఖరారు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని