సమస్యలున్నాయని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమా?

రాష్ట్రంలో సమస్యలు లేవని ప్రభుత్వం చెబుతోందని, ఉన్నాయని నిరూపిస్తే సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేస్తారా అని వైతెపా అధ్యక్షురాలు షర్మిల సవాల్‌ విసిరారు.

Updated : 05 Oct 2022 06:29 IST

సీఎం కేసీఆర్‌కు వైఎస్‌ షర్మిల సవాల్‌

చేగుంట, జోగిపేట టౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సమస్యలు లేవని ప్రభుత్వం చెబుతోందని, ఉన్నాయని నిరూపిస్తే సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేస్తారా అని వైతెపా అధ్యక్షురాలు షర్మిల సవాల్‌ విసిరారు. మంగళవారం ప్రజాప్రస్థాన యాత్ర మెదక్‌ జిల్లా చిన్నశంకరంపేట, చేగుంటలలో కొనసాగింది. చేగుంటలో ఏర్పాటుచేసిన సభలో ఆమె మాట్లాడారు. అత్యాచారాల్లో దేశంలోనే తెలంగాణ తొలిస్థానంలో ఉందని విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు భాజపా కండువా కప్పుకొన్న తెరాస నాయకుడని మండిపడ్డారు. పండగ నేపథ్యంలో పాదయాత్రకు మూడు రోజులు విరామమిస్తున్నట్లు వైతెపా ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 8న కామారెడ్డిలో పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది.

అట్రాసిటీ కేసు నమోదు

షర్మిలపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు జోగిపేట ఎస్‌ఐ సోమ్యానాయక్‌ తెలిపారు. సెప్టెంబరు 30న సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగిన బహిరంగ సభలో అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాల వారు, తెరాస నాయకులు ఫిర్యాదు చేశారని చెప్పారు. తనపై కేసు నమోదు కావడంపై షర్మిల స్పందించారు. క్రాంతికిరణ్‌ అవినీతి గురించి మాట్లాడితే తనపై కేసు నమోదు చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గురించి ఆయన తండ్రి స్వయంగా చెప్పిన మాటలనే తాను ప్రస్తావించానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని