పార్లమెంటరీ కమిటీల్లో విపక్షాలకు షాక్‌

పార్లమెంటరీ స్థాయీసంఘాల ఛైర్మన్‌ పదవుల విషయంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, తెరాస, సమాజ్‌వాదీ పార్టీలకు షాక్‌ తగిలింది.

Updated : 05 Oct 2022 06:19 IST

ఛైర్మన్‌ పదవుల నుంచి తెరాస, కాంగ్రెస్‌, తృణమూల్‌, ఎస్పీల తొలగింపు
పరిశ్రమల కమిటీ నుంచి కేకేకు ఉద్వాసన
భాజపా చేతుల్లోకి హోం, ఐటీ శాఖల స్థాయీ సంఘాలు

ఈనాడు, దిల్లీ: పార్లమెంటరీ స్థాయీసంఘాల ఛైర్మన్‌ పదవుల విషయంలో ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, తెరాస, సమాజ్‌వాదీ పార్టీలకు షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ ఇదివరకు హోంశాఖ, శాస్త్రసాంకేతికం, ఐటీ కమ్యూనికేషన్‌ విభాగాల కమిటీలకు నేతృత్వం వహించగా ఈసారి హోం, ఐటీ-కమ్యూనికేషన్ల కమిటీలను తప్పించి శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల కమిటీకే ఆ పార్టీని పరిమితం చేశారు. పార్లమెంటులో మొత్తం 24 కమిటీలు ఉండగా... మంగళవారం 22 కమిటీలను పునర్వ్యవస్థీకరించగా అందులో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఒక్కటీ దక్కలేదు. తెరాస ఎంపీ కేశవరావు పరిశ్రమల శాఖ కమిటీకి నేతృత్వం వహించగా ఈసారి ఆయన్ను తప్పించారు. డీఎంకే సభ్యుడు తిరుచ్చిశివకు ఆ బాధ్యతలు అప్పగించారు. సమాజ్‌వాదీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ను వైద్యారోగ్యశాఖ కమిటీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను భాజపా సభ్యుడు భువనేశ్వర్‌ కాలితాకు ఇచ్చారు. తాజాగా ప్రకటించిన మొత్తం 22 కమిటీల్లో 15కి భాజపా నేతృత్వం వహించనుంది. మిగిలిన ఏడింటిలో డీఎంకేకి రెండు, వైకాపా, కాంగ్రెస్‌, శివసేన, జేడీయూ, బీజేడీకి ఒక్కోటి చొప్పున దక్కాయి. ఇదివరకు వాణిజ్యశాఖ కమిటీకి నేతృత్వం వహించిన విజయసాయిరెడ్డికి ఈసారి రవాణా, పర్యాటకం, సాంస్కృతికశాఖ కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించారు. గతంలో టీజీ వెంకటేష్‌ ఈ బాధ్యతలు చూసేవారు. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ స్థాయీ సంఘాల్లో అత్యంత ప్రధానమైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశాంగ వ్యవహారాల కమిటీల్లో దేనికీ నేతృత్వం వహించకపోవడం ఇదే తొలిసారి. రాజ్యసభ, లోక్‌సభలో ఆ పార్టీ సభ్యులు తగ్గిపోవడంతో రెండు కమిటీలను కోల్పోవాల్సి వచ్చింది. వివిధ కమిటీల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కనకమేడల రవీంద్రకుమార్‌, రఘురామకృష్ణరాజు, సీఎం రమేష్‌, జయదేవ్‌ గల్లా, నందిగం సురేష్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, వి.విజయేంద్రప్రసాద్‌, గోరంట్ల మాధవ్‌ తదితరులకు... తెలంగాణ నుంచి కె.కేశవరావు, అసదుద్దీన్‌ ఒవైసీ, మాలోత్‌ కవిత, జి.రంజిత్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సోయం బాపురావు, జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ తదితరులకు సభ్యులుగా అవకాశం దక్కింది.

వివిధ కమిటీలు, ఛైర్మన్లు, కమిటీలోని తెలుగు రాష్ట్రాలకు చెందిన సభ్యుల వివరాలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని