పోటీ చేయొద్దు.. పార్టీని గెలిపించండి: సునీల్‌ బన్సల్‌ వ్యాఖ్యలతో అవాక్కయిన నేతలు

భాజపా తరఫున అసెంబ్లీ ప్రభారీ (ఇన్‌ఛార్జి)లుగా నియమితులైన వారికి ఒక్కరోజులోనే షాక్‌ తగిలింది. రాష్ట్రంలో భాజపాను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూనే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ సూచించడంతో అసెంబ్లీ ఇన్‌ఛార్జులు అవాక్కయ్యారు.

Updated : 09 Oct 2022 09:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా తరఫున అసెంబ్లీ ప్రభారీ (ఇన్‌ఛార్జి)లుగా నియమితులైన వారికి ఒక్కరోజులోనే షాక్‌ తగిలింది. రాష్ట్రంలో భాజపాను గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూనే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ సూచించడంతో అసెంబ్లీ ఇన్‌ఛార్జులు అవాక్కయ్యారు. పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు.. అసెంబ్లీ ఇన్‌ఛార్జులుగా నియమితులైన నేతలతో సునీల్‌ బన్సల్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, సహ ఇన్‌ఛార్జి అరవింద్‌ మేనన్‌ పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన దాదాపు ఏడు గంటల పాటు ఈ సమావేశాలు విడివిడిగా జరిగాయి. తొలుత జిల్లాల్లో పార్టీ పరిస్థితి, బూత్‌ కమిటీలు, శక్తికేంద్రాలు, మండల కమిటీల గురించి జిల్లా అధ్యక్షులను తరుణ్‌ఛుగ్‌ మాట్లాడించి నివేదికలు తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులను ఉద్దేశించి బన్సల్‌ మాట్లాడారు.

రెండుచోట్ల ఎలా కుదురుతుంది?

‘రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులుగా ఏరికోరి మిమ్మల్ని నియమించాం. ఆషామాషీగా వద్దు. కష్టపడి పనిచేయండి. నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీదే. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు పోటీ చేయొద్దు’ అంటూ ఉద్బోధించారు. దీనిపై ఆశావహులు కొందరు స్పందించడంతో.. ‘మీరు అక్కడో కాలు(ఇన్‌ఛార్జిగా ఉన్న నియోజకవర్గం), ఇక్కడో కాలు(సొంత నియోజకవర్గం) వేస్తే ఎలా కుదురుతుంది? అని బన్సల్‌ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి ఎవరికి ఉంది? అని బన్సల్‌ ప్రశ్నించగా.. మూడొంతులకు పైగా ఇన్‌ఛార్జులు చేతులెత్తినట్లు తెలిసింది. బన్సల్‌ స్పందిస్తూ.. ‘అప్పగించిన నియోజకవర్గాల్లో బాగా పనిచేయండి. మీ నియోజకవర్గంలో పార్టీని మరో ఇన్‌ఛార్జి బలోపేతం చేస్తారు’ అని బదులిచ్చారు. ‘నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా ఆరు నెలలు కష్టపడి పనిచేయండి.. అక్కడ ఫలితం చూపిస్తే అవకాశాలుంటాయి’ అని బండి సంజయ్‌ సర్దిచెప్పారు. తరుణ్‌ఛుగ్‌ మాట్లాడుతూ- మునుగోడుకు వెళ్లి పనిచేసే కార్యకర్తల జాబితా రూపొందించి ఇవ్వాలని జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జులకు సూచించారు. ‘ఊరికే వెళ్లి కనిపించి రావడం కాదు.. పూర్తిస్థాయిలో 10-15 రోజుల పాటు పనిచేయగలిగే వారినే ఎంపిక చేయండి’ అని స్పష్టం చేశారు. సమావేశంలో భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని