Mulayam Singh Yadav: రాజకీయ మల్లయోధుడు.. ములాయం
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదిసార్లు ఎమ్మెల్యే. ఏడుసార్లు ఎంపీ.. మూడుసార్లు ముఖ్యమంత్రి. సాధారణంగా ఈ స్థాయిలో చక్రంతిప్పిన నేతలు భారత రాజకీయ చరిత్రలోనే అరుదుగా కనిపిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదిసార్లు ఎమ్మెల్యే. ఏడుసార్లు ఎంపీ.. మూడుసార్లు ముఖ్యమంత్రి. సాధారణంగా ఈ స్థాయిలో చక్రంతిప్పిన నేతలు భారత రాజకీయ చరిత్రలోనే అరుదుగా కనిపిస్తారు. అలాంటి విలక్షణ నాయకుడే.. ములాయం సింగ్ యాదవ్. సోమవారం కన్నుమూసిన ఆయన రాజకీయ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం.
రెజ్లింగ్ నుంచి రాజకీయాల్లోకి
ములాయం సింగ్ యాదవ్ కళాశాల రోజుల్లో మల్లయోధుడు(రెజ్లర్). ప్రత్యర్థిని ఉడుంపట్టు పట్టి నేలకరిపించడమంటే ఇష్టం. అలా 1962లో ప్రత్యర్థిని మట్టికరిపించిన ఓ కుస్తీ పోటీ ములాయం రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. జశ్వంత్నగర్లో జరిగిన ఆ పోటీలో ములాయం చూపిన సత్తా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ నేత నాథూసింగ్ను ఆకర్షించింది. దీంతో 1967 ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ములాయంకు నాథూసింగ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అక్కడ్నుంచి ఈ మల్లయోధుడు వెనుదిరిగి చూసుకోలేదు. యువకుడిగా ములాయంపై ప్రముఖ సోషలిస్టు నేత రామ్మనోహర్ లోహియా ప్రభావం ఎక్కువ. 1975లో ఇందిరాగాంధీ అత్యయిక స్థితి విధించిన సమయంలో ములాయం 19 నెలలు జైలు శిక్ష అనుభవించారు. 1977లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1980లో యూపీలో లోక్దళ్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత ఆ పార్టీ జనతా దళ్లో భాగమైంది. 1989లో ములాయం సింగ్ యాదవ్ తొలిసారి యూపీ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. తర్వాత కేంద్రంలోని వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోవడంతో చంద్రశేఖర్ సారథ్యంలోని జనతాదళ్(సోషలిస్టు) పార్టీలో ములాయం చేరారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో యూపీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 1991లో కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భాజపా నెగ్గింది. అనంతరం 1992లో ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీని స్థాపించారు. 1993లో జరిగిన ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తుపెట్టుకొని గెలిచారు. దీంతో కాంగ్రెస్, జనతాదళ్ మద్దతుతో రెండో దఫా ముఖ్యమంత్రి పదవిలో ములాయం ఆసీనులయ్యారు. మిత్రపక్షాలతో విభేదాలు రావడం వల్ల 1995లో ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయారు.
కేంద్రంలోనూ చక్రం
1996 సార్వత్రిక ఎన్నికల్లో మెయిన్పురి నుంచి ఎంపీగా ఎన్నికైన ములాయం కేంద్రంలోనూ చక్రం తిప్పారు. ప్రతిపక్షాలు భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ప్రధాని పదవి రేసులో ములాయం పేరు కూడా వినిపించింది. కానీ రక్షణ మంత్రిగానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ములాయం హయాంలోనే రష్యాతో సుఖోయ్ యుద్ధవిమానాల ఒప్పందం కుదిరింది. 2003లో ములాయం మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2012లో నాలుగోసారి సీఎం అవకాశం వచ్చినా కుమారుడు అఖిలేశ్ యాదవ్ కోసం పగ్గాలు వదులుకున్నారు.
ప్రస్థానం ముగిసిందిలా..
ములాయం తన చివరిరోజుల్లో కుటుంబంలో, పార్టీలో వచ్చిన వివాదాలను సరిదిద్దలేకపోయారు. అఖిలేశ్ తన బాబాయ్ శివపాల్ యాదవ్ను కేబినెట్ నుంచి తప్పించి పార్టీలో తండ్రి అధికారానికి సవాల్ విసిరారు. తదనంతర పరిణామాల్లో 2017 జనవరి ఒకటిన ఎస్పీ జాతీయ సమావేశాల్లో ములాయంను పార్టీ అధ్యక్ష పదవి నుంచి అఖిలేశ్ తప్పించారు. దీంతో రగిలిపోయిన ములాయం పార్టీ జాతీయ సమావేశాల నిర్వహణ అక్రమమంటూ దానికి బాధ్యుడైన రాంగోపాల్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే అధికారం రాంగోపాల్ యాదవ్కు ఉందంటూ ఎన్నికల సంఘం రూలింగ్ ఇవ్వటంతో ములాయం ఇచ్చిన బహిష్కరణ ఉత్తర్వులు రద్దయ్యాయి. దీంతో అఖిలేశ్ అధికారికంగా సమాజ్వాదీ పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడయ్యారు. దీంతో పార్టీతోపాటు యూపీలోనూ ములాయం పట్టు కోల్పోవాల్సి వచ్చింది.
ప్రధాని పీఠం త్రుటిలో చేజారిన వేళ..!
దాదాపు ఐదు దశాబ్దాల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ములాయం సింగ్ యాదవ్కు ఓసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం అత్యంత దగ్గరగా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకు ప్రధాని పీఠం త్రుటిలో దూరమైంది. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్కు 141 సీట్లు రాగా.. 161 సీట్లతో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అటల్ బిహారీ వాజ్పేయీకి ఆహ్వానం రావడంతో ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 13 రోజులకే వాజ్పేయీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి కనబరచకపోవడంతో 1989లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వీపీ సింగ్పై అందరి దృష్టి పడింది. అయితే ప్రధాని పదవి చేపట్టేందుకు ఆయన నిరాకరించారు. దీంతో ములాయం.. పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతిబసు పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను సీపీఎం పొలిట్బ్యూరో తిరస్కరించింది. ఈ క్రమంలోనే ములాయం, లాలూ ప్రసాద్ యాదవ్ పేర్లు తెరపైకి వచ్చాయి. అప్పటికే దాణా కుంభకోణం కేసులో లాలూపై అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆయన పేరును పక్కనబెట్టారు. అనంతరం నాటి సీపీఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జిత్.. ములాయం పేరును సూచించారు. ఈ ప్రతిపాదనను లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ వ్యతిరేకించారు. దీంతో ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని ములాయం కోల్పోయారు. అనంతరం దేవెగౌడ నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి