Mallikarjun Kharge: కాంగ్రెస్ కొత్త సారథి ఖర్గే
గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు, కర్ణాటక సీనియర్ నేత, దళిత కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
24 ఏళ్ల తర్వాత అధ్యక్ష పీఠంపై గాంధీ కుటుంబేతర వ్యక్తి
దిల్లీ: గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు, కర్ణాటక సీనియర్ నేత, దళిత కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే.. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన ఓట్ల లెక్కింపులో 80 ఏళ్ల ఖర్గే.. దాదాపు 84 శాతం పైగా ఓట్లు సాధించి.. ప్రత్యర్థి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ను ఓడించారు. పోలైన 9,385 ఓట్లలో ఖర్గేకు 7,897, థరూర్కు 1,072 లభించాయి. 416 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు. సోమవారం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా ఈ నెల 26న బాధ్యతలు స్వీకరించనున్న ఖర్గే.. 24 ఏళ్ల తర్వాత ఆ పదవిని అధిరోహించనున్న గాంధీ కుటుంబేతర వ్యక్తి కానున్నారు. ఎన్నికైన తర్వాత ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ.. మతవాదం పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న భాజపాపై తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ‘‘అందరూ కార్యకర్తల్లా పనిచేయాలి. ఇక్కడ పెద్దా, చిన్నా తేడా లేదు. అంతా సమానులే. ఫాసిస్టు శక్తులను కలిసికట్టుగా ఎదుర్కొవాలి’’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఓడిన శశిథరూర్.. ఖర్గేకు అభినందనలు తెలుపుతూ.. ఈ ఎన్నికతో కార్యకర్తలు ఉత్తేజితులయ్యారని.. భాజపాను ధైర్యంగా ఎదుర్కొంటారని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ కేంద్రఎన్నికల సంఘానికి థరూర్ వర్గం ఫిర్యాదు చేసింది.
పేరుకే అధ్యక్షుడా..!
సోనియాగాంధీ వారసుడిని ఎన్నుకొనేందుకు జరిగిన ఎన్నికల్లో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆలస్యంగా ప్రవేశించినా, ఆయన విజయం ఖాయమని ముందు నుంచీ పార్టీ వర్గాలు భావించాయి. గాంధీ కుటుంబం ఆశీస్సులతోనే ఆయన రంగంలోకి దిగారన్నదే బహిరంగ రహస్యమే. అందుకు అనుగుణంగానే ఖర్గే భారీ మెజారిటీతో నెగ్గారు. ఈ నేపథ్యంలో సోనియా, రాహుల్ ఆదేశాల మేరకు ఖర్గే పనిచేస్తారా, లేదా ఎన్నికల్లో వరస పరాజయాలతో కుంగిన కాంగ్రెస్కి సొంత నిర్ణయాలతో నూతన జవసత్వాలు తీసుకొస్తారా అన్నది కీలక ప్రశ్న. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో గాంధీ కుటుంబేతర వ్యక్తి స్థిరంగా కొనసాగడం సులభమైన విషయం కాదు. ఆ కుటుంబానికి చెందనివారి నుంచి చివరిసారి ఈ పదవిని అధిరోహించిన సీతారాం కేసరి 1998లో అవమానకర పరిస్థితుల్లోపదవిని వీడాల్సి వచ్చింది.
యూపీలో రిగ్గింగ్.. తెలంగాణ, పంజాబ్లోనూ: థరూర్ వర్గం
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, తెలంగాణలో అవకతవకలు జరిగాయని శశిథరూర్ బృందం ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీకి థరూర్ ముఖ్య ఎన్నికల ప్రతినిధి సల్మాన్ సోజ్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఉత్తర్ప్రదేశ్లో పోలైన ఓట్లన్నింటిని చెల్లనివిగా పరిగణించాలని లేఖలో డిమాండ్ చేశారు. ‘‘యూపీ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులకు సీళ్లు వేయలేదు. పోలింగ్ కేంద్రం వద్ద అనధికారిక వ్యక్తులు ఉన్నారు. ఓటు వేయడానికి వచ్చిన ప్రతినిధుల ఓట్లను అప్పటికే వేసేశారు’’ అని సోజ్ పేర్కొన్నారు. పంజాబ్, తెలంగాణల్లోనూ ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదని ఆరోపించారు. పంజాబ్లో బోగస్ ఓట్లు వేసేందుకు అవకాశం కల్పిస్తే.. తెలంగాణలో ప్రతినిధుల జాబితాల్లో మార్పులు చేర్పులు చేశారని ఆరోపించారు. అయితే ఈ ఫిర్యాదుకు ఆధారాలు లేవని మిస్త్రీ పేర్కొన్నారు. లేఖను బహిర్గతం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య దృష్టి ఉన్న నేత: రాహుల్
కాంగ్రెస్ నూతన సారథిగా ఎన్నికైన ఖర్గేను రాజాజీ మార్గ్లోని ఆయన నివాసానికి వెళ్లి సోనియాగాంధీ అభినందించారు. దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. ఆమె వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఉన్నారు. ‘భారత జోడో యాత్ర’లో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాస్వామ్య దృష్టి ఉన్న నేత అని కొనియాడారు. ఆయనే ఇక నుంచి తమ పార్టీ సుప్రీం అథారిటీ అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఖర్గేను అభినందిస్తూ, అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ఫలవంతం కావాలని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..