Munugode Bypoll: ఒట్టేసి చెప్పు.. ఓటేస్తానని!
చౌటుప్పల్ మండలంలో ఓ గ్రామానికి ఇన్ఛార్జిగా ఉన్న ప్రధాన పార్టీ ఎమ్మెల్యే అక్కడున్న సుమారు 700 మంది ఓటర్లను 15 ఆర్టీసీ బస్సుల్లో గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి తీసుకెళ్లారు.
మెజారిటీ కోసం ప్రధాన పార్టీల ఎత్తుగడలు
రకరకాల ప్రచార వ్యూహాలతో ముందుకు
700 మందిని యాదాద్రికి తీసుకెళ్లి ప్రమాణం చేయించిన ఓ పార్టీ నేత
పెట్రోలు ఉచితంగా పోయిస్తున్న మరో పార్టీ
నేటి నుంచి కాంగ్రెస్ ఇంటింటికీ బొట్టుపెట్టే కార్యక్రమం
* చౌటుప్పల్ మండలంలో ఓ గ్రామానికి ఇన్ఛార్జిగా ఉన్న ప్రధాన పార్టీ ఎమ్మెల్యే అక్కడున్న సుమారు 700 మంది ఓటర్లను 15 ఆర్టీసీ బస్సుల్లో గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి తీసుకెళ్లారు. గర్భగుడిలో సదరు పార్టీకే ఓటేస్తామంటూ వారితో ప్రమాణం చేయించారని సమాచారం. తర్వాత కొండ కింద ఫంక్షన్హాళ్లలో మేకమాంసంతో ‘దావత్’ కూడా ఇచ్చారు.
* మరో ప్రధాన పార్టీ మునుగోడు మండలంలోని ఓ పెట్రోల్ బంకులో ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ బైక్లకు రెండు లీటర్ల వరకు పెట్రోల్ ఉచితంగా పోయిస్తోంది. తమ పార్టీకి మద్దతుగా ఆ రోజు మండలంలో ఎక్కడ కార్యక్రమం ఉంటే అక్కడ పాల్గొనాలనే షరతుతో ఆ పార్టీ పెట్రోలు పథకం అమలుచేస్తున్నట్టు సమాచారం.
ఈనాడు - నల్గొండ
మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీల నాయకులు ఓట్ల కోసం రకరకాల ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. ప్రధానంగా పలు గ్రామాలు, మండలాలకు ఇన్ఛార్జులుగా ఉన్న ప్రధాన పార్టీల ముఖ్య నేతలకు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. తాము ఇన్ఛార్జులుగా ఉన్న ప్రాంతాల్లో పార్టీకి మెజార్టీ రాకుంటే ఎన్నికల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠ మసకబారుతుందని భావిస్తున్న వారు..ఎప్పటికప్పుడు ఓటర్లను తమవైపు తిప్పుకొనే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎవరికి వారు వేగుల ద్వారా క్షేత్రస్థాయిలోని పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు. ఎదుటి పార్టీ నాయకుడు ఏ ప్రచార వ్యూహాన్ని అమలుచేస్తున్నారో తెలుసుకుంటూ, దాన్ని చిత్తుచేసే ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు.
రోజూ రూ.కోటికి పైగా ఖర్చు
ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే తాయిలాలు ప్రకటించాయి. వ్యక్తిగతంగానూ ‘అడిగిన వాళ్లకు అడిగినంత’ అన్నట్టుగా ఇచ్చేస్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 298 బూత్లుండగా.. ప్రతి పార్టీ రోజూ సగటున కార్యకర్తల భోజనాలు, మద్యం తదితరాలకే సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. కుల సంఘాల నేతలు, ఇతరత్రా ఓ స్థాయి ఉన్న వారికి రోజువారీగా ఇచ్చేది దానికి అదనం. ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులు, తటస్థులు పార్టీలో చేరేలా ప్రోత్సహించే వారికిచ్చే నజరానాలు బోనస్. మొత్తంగా ఒక్కో ప్రధాన పార్టీ చిల్లర ఖర్చులకే రోజుకు రూ.కోటికిపైగా వెచ్చిస్తున్నట్టు సమాచారం. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామ స్థాయిలో క్యాడర్ ఎటూ పోకుండా చూసుకోవడమే ముఖ్యమని, అందుకు ఎంత డబ్బయినా ఖర్చు చేయక తప్పదని’ ఓ నేత ‘ఈనాడు’తో అన్నారు. అయితే, అన్ని పార్టీల వద్దా డబ్బు తీసుకుంటున్న నేపథ్యంలో వాళ్లంతా తమవైపే ఉంటారని, తమకే ఓటేస్తారనే విశ్వాసం మాత్రం నేతలకు లేదు. ఈ నేపథ్యంలో నమ్మకం పొందేలా వారంతా కొత్త వ్యూహాలకు తెరలేపారు. ఓ ప్రధాన పార్టీ నేత గురువారం యాదాద్రిలో సుమారు 700 మంది ఓటర్లతో గర్భగుడిలో ప్రమాణం చేయించడం అందులో భాగమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ రాజీనామాతో ఆ సామాజికవర్గంలో పట్టు కోల్పోకుండా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యను తిరిగి పార్టీలో చేర్చుకోవడం కూడా తెరాస అనుసరిస్తున్న ఎత్తుకు పైఎత్తుల్లో భాగమేనని చెబుతున్నారు.
ఇంటింటికీ బొట్టుపెట్టే కార్యక్రమం
కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి (21, 22) రెండు రోజుల పాటు నియోజకవర్గంలోని మహిళలందరికీ బొట్టుపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నియోజకవర్గంలో మహిళల ఓట్లు 1.19 లక్షలున్నాయి. వీరందరినీ ప్రత్యక్షంగా కలుస్తూ ఓటు అభ్యర్థించాలనేది ప్రణాళిక. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి సహా ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. తిరిగి 28, 29వ తేదీల్లో మరోసారి రెండు రోజుల పాటు ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వలస ఓటర్లపై వల
వారిని కలిసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు
మునుగోడు ఉప ఎన్నిక గెలుపోటముల్లో కీలకమైన వలస ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి ఓట్లు అభ్యర్థించే కసరత్తును ప్రధాన పార్టీలు ఆరంభించాయి. నియోజకవర్గానికి చెందిన సుమారు 35 వేల నుంచి 40 వేల ఓటర్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు ముంబయి, సూరత్, భివండి, సోలాపూర్ ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని ఓటర్ల చిరునామాలను ఓ ప్రధాన పార్టీ సేకరించింది. వీరిని వ్యక్తిగతంగా కలిసేందుకు బూత్కు ఇద్దరు చొప్పున ప్రత్యేక బృందాలను నియమించింది. ఓటర్లున్న ప్రాంతాలకు వెళ్లి వారిని ప్రసన్నం చేసుకోవడం, తమ పార్టీకే మద్దతిచ్చేలా ఒప్పించడం, పోలింగ్కు రెండు రోజుల ముందే ఇక్కడికి వచ్చేలా చూడటం ఆ బృందాల బాధ్యత. అందుకోసం ప్రత్యేకంగా వాహనాలను ఆ పార్టీ సమకూర్చింది. ఆ మేరకు 80 బూత్లకు చెందిన ప్రత్యేక బృందాలు గురువారం వలస ఓటర్ల వద్దకు బయల్దేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్