TDP: సత్తెనపల్లిలో తెలుగు తమ్ముళ్ల ఘర్షణ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గురువారం రసాభాసగా మారింది.

Updated : 11 Nov 2022 07:54 IST

ఇన్‌ఛార్జి నియామకం చేపట్టాలని డిమాండ్‌

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ గురువారం రసాభాసగా మారింది. నాలుగు మండలాలు, సత్తెనపల్లి పట్టణ అధ్యక్ష పదవితో పాటు క్లస్టర్‌ ఇన్‌ఛార్జిల నియామకానికి అభిప్రాయ సేకరణ జరపటానికి పార్టీ పరిశీలకుల బృందం వచ్చింది. తొలుత నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిని నియమించాలని హడావుడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

ఒకదశలో మాజీమంత్రి నక్కా ఆనందబాబు నియోజకవర్గ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. దివంగత నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్‌ మద్దతుదారులు ఇన్‌ఛార్జి పదవి తమ నాయకుడికే ఇవ్వాలంటూ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి పరిశీలకులతో ఘర్షణపడ్డారు. మిగిలిన నాయకుల అనుయాయులు తమ నాయకుడికి ఇన్‌ఛార్జి పదవి ఇవ్వాలంటూ పట్టుబట్టడం.. ఈ క్రమంలో అరుపులు, కేకలతో కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

శివరామ్‌ మద్దతుదారులు మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు మద్దతుదారులతో వాగ్వాదానికి దిగారు. ఆంజనేయులును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరు బాహాబాహీకి దిగి కుర్చీలు విసిరేసుకునే వరకు వెళ్లింది. పరిశీలకులుగా వచ్చిన వారిని నిర్బంధించే ప్రయత్నం చేశారు. కొందరు విలేకర్ల ఫోన్లు లాక్కుని వారితో అనుచితంగా ప్రవర్తించారు. పార్టీ పరిశీలకులుగా వచ్చిన ఎమ్మెల్యే డోల వీరాంజనేయస్వామి, మాజీమంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, నియోజకవర్గ పరిశీలకుడు గన్నె వెంకటనారాయణ ప్రసాద్‌ (అన్నా) నాయకులతో మాట్లాడి గొడవ సద్దుమణిగేలా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని