ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే దాడులు: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తెలంగాణలో తెరాస ప్రభుత్వం దర్యాప్తులు, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు.

Published : 25 Nov 2022 04:12 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే తెలంగాణలో తెరాస ప్రభుత్వం దర్యాప్తులు, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. గురువారం హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని బీఎస్సీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2014 నుంచి ఈ దాడులు, దర్యాప్తులు ఎందుకు జరగలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. తన 26 ఏళ్ల సర్వీసులో ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి దాడుల్లో జైలుకు వెళ్లిన సందర్భాలు లేవని, వెళ్లినా అందులో వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారని అన్నారు. పాలకులు పోడు భూములకు పట్టాలివ్వకుండా అటవీ అధికారులను చంపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 27 నుంచి 50 శాతానికి పెంచాలని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలనూ పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లు పెంచాలంటూ బీఎస్పీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26న ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకూ వాటా కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి రాష్ట్రపతికి పంపనున్నామని వివరించారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానందరావు, రాష్ట్ర మైనార్టీ కన్వీనర్‌ అబ్రార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని