స్వార్థ రాజకీయాలు చేసేవారికి బుద్ధి చెప్పాలి

‘తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. అబద్ధాల పునాదుల మీద స్వార్థ రాజకీయాలు చేసే వారికి ప్రజలు బుద్ధి చెప్పాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

Published : 01 Dec 2022 03:27 IST

మంత్రి హరీశ్‌రావు

దుబ్బాక, మిరుదొడ్డి, సిద్దిపేట, న్యూస్‌టుడే: ‘తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. అబద్ధాల పునాదుల మీద స్వార్థ రాజకీయాలు చేసే వారికి ప్రజలు బుద్ధి చెప్పాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో తహసీల్దార్‌, సబ్‌రిజిస్ట్రార్‌ తాత్కాలిక కార్యాలయాలను మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దారుగా వీరేశం బాధ్యతలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ముఖ్యమంత్రి నూతన మండలాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బావుల దగ్గర విద్యుత్‌ మీటర్లు పెట్టమనడం నిజం కాకపోతే రాష్ట్రానికి ఏడాదికి రూ.6 వేల కోట్ల చొప్పున.. రెండు సంవత్సరాలకు రూ.12 వేల కోట్లను ఎందుకు ఇవ్వలేదో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి’’ అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, సహాయక పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్‌, జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయ ప్రారంభోత్సవంలో రసాభాస

తహసీల్దార్‌ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రఘునందన్‌రావు హాజరవడంతో.. తెరాస, భాజపా నాయకులు భారీగా అక్కడికి చేరుకున్నారు. తెరాస నాయకులు పార్టీ కండువాలతో కార్యక్రమానికి హాజరవడంపై భాజపా శ్రేణులు అభ్యంతరం తెలిపాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మెదక్‌-సిద్దిపేట ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని