ఆమ్‌ ఆద్మీకి బోణీ కష్టమే

శాసనసభా సమరంలో గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) బోణీ కొట్టేందుకు కూడా అవకాశాలు లేవనీ, ప్రజల మదిలోనే ఆ పార్టీ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు.

Published : 01 Dec 2022 03:27 IST

గుజరాత్‌లో గెలిచేది మేమే: అమిత్‌షా

అహ్మదాబాద్‌: శాసనసభా సమరంలో గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) బోణీ కొట్టేందుకు కూడా అవకాశాలు లేవనీ, ప్రజల మదిలోనే ఆ పార్టీ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన బుధవారం పీటీఐ వార్తాసంస్థ ముఖాముఖిలో పలు అంశాలపై స్పందించారు. ఆప్‌ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. ప్రతి పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందని చెప్పారు. ఆ పార్టీని ఆమోదించాలా? వద్దా? అన్నది ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ‘మాకు ఇంకా కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి. ప్రస్తుతం ఆ పార్టీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. గుజరాత్‌ ఎన్నికల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది. ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న ప్రజాదరణ, సీఎంగా ఆయన ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి పనులు, బుజ్జగింపు రాజకీయాలకు దూరంగా ఉండడం వంటివాటి కారణంగానే గత 27 ఏళ్లుగా గుజరాత్‌ ప్రజలు భాజపానే ఆదరిస్తున్నారు. ఈసారి కూడా రికార్డుస్థాయి ఘన విజయం ఖాయం’ అని అమిత్‌షా చెప్పారు.

జాతీయ భద్రతపై రాష్ట్రాల్లో ప్రస్తావించడం తప్పేమీ కాదు

రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలను అమిత్‌ షా ఖండించారు. అవి స్వతంత్ర, తటస్థ సంస్థలని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్ర గురించి ప్రశ్నించగా- రాజకీయాల్లో నిలకడైన ప్రయత్నాలు తప్పనిసరి అని చెప్పారు. రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో జాతీయ భద్రత గురించి ప్రస్తావించడం తప్పేమీ కాదని సమర్థించుకున్నారు. గుజరాత్‌ కూడా సరిహద్దు రాష్ట్రమని గుర్తుచేశారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) సంస్థ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృష్ట్యా నిషేధించడంలో తప్పు లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ప్రాంతీయ పార్టీల కూటముల ప్రభావం ఉండదు

‘ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల వెలుపల సాధించేదేమీ ఉండదు. ప్రాంతీయ పక్షాల కూటములు ప్రభావం చూపిస్తాయని నేను అనుకోను. భాజపా చాలాచోట్ల విస్తరిస్తోంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలోనూ బాగా పనిచేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోనూ సీట్లు బాగా పెరుగుతాయి’ అని అమిత్‌షా తెలిపారు. సాంకేతిక, వైద్య, న్యాయశాస్త్ర విద్యను హిందీలో, ప్రాంతీయ భాషల్లో బోధించాల్సిన అవసరం ఉందన్నారు.

మోదీ ఆదరణపై మేం ఆధారపడకూడదా?

మోదీ తమ నేత అనీ, ఆయనకు ఉన్న ఆదరణను ఎన్నికల్లో వాడుకోవడం సబబేనని అమిత్‌షా సమర్థించుకున్నారు. ఆయన పేరును ఎన్నికల్లో ప్రస్తావించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు