రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మళ్లీ ఖర్గే?

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా తిరిగి కొనసాగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.

Published : 03 Dec 2022 05:40 IST

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా తిరిగి కొనసాగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఆయన స్థానంలో ప్రతిపక్ష నాయకుడిగా చిదంబరాన్ని ఎంపిక చేస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒక వేళ ఖర్గేను ఆ పదవిలో కొనసాగిస్తే పార్టీ అగ్రనేత చెప్పిన ‘ఒకే వ్యక్తి..ఒకే పదవి’ విధానానికి గండి పడినట్లవుతుంది. ఈ నెల 7 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నందున రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఎవరిని కొనసాగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోనియాగాంధీ శనివారం వ్యూహాత్మక కమిటీ భేటీకి పిలుపునిచ్చినట్లు సమాచారం.

  ‘ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ నిబంధన మేరకు ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేశారు. అయితే, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకైనా ఆయన ప్రతిపక్ష నేతగా కొనసాగే అవకాశం ఉందని పార్టీలో కీలక నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిపేందుకు తొలుత రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌నే గాంధీ కుటుంబం ఎంపిక చేసింది. అయితే, పార్టీ నియమాల ప్రకారం అధ్యక్షుడిగా పోటీ చేస్తే.. సీఎం పదవికి రాజీనామా చేయాలని సచిన్‌ పైలట్‌ వర్గీయులు డిమాండ్‌ చేశారు. మరోవైపు రాహుల్‌ గాంధీ కూడా ‘ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయడంతో..గహ్లోత్‌ అధ్యక్ష రేసు నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం మల్లికార్జున ఖర్గే పేరు తెరమీదకి వచ్చింది. అయితే, ఖర్గేను రాజ్యసభలో ప్రతిపక్షనేతగా కొనసాగిస్తే పార్టీలో మళ్లీ విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నందున సీనియర్‌ నేత పి.చిదంబరం పేరు ఆ పదవికి వినిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని