రాష్ట్ర హక్కులపై పార్లమెంట్‌లో పోరాడతాం

రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలుకు పార్లమెంట్‌లో పోరాడతామని తెదేపా లోక్‌సభాపక్ష నేత కె.రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

Published : 06 Dec 2022 06:27 IST

రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అరాచకాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం

తెదేపా లోక్‌సభాపక్ష నేత రామ్మోహన్‌నాయుడు

ఈనాడు, దిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలుకు పార్లమెంట్‌లో పోరాడతామని తెదేపా లోక్‌సభాపక్ష నేత కె.రామ్మోహన్‌నాయుడు తెలిపారు. పార్లమెంట్‌ శీతకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత చంద్రబాబునాయుడు నేతృత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని సోమవారం దిల్లీలో నిర్వహించారు. ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం రామ్మోహన్‌నాయుడు విలేకరులతో మాట్లాడారు. తెదేపా ప్రాంతీయ పార్టీ అయినా జాతీయభావాలు గల పార్టీ అని, దేశప్రతిష్ఠను కాపాడడంలో, భవిష్యత్తును నిర్దేశించడంలో చంద్రబాబు ముందుంటారని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని ఆహ్వానం మేరకు జీ-20పై సమావేశంలో పాల్గొన్నారని వివరించారు. ‘రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన హక్కుల సాధనలో వైకాపా పూర్తిగా విఫలమైంది. ప్రజల పక్షాన ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, వెనుకబడిన జిల్లాలకు నిధులు, విశ్వవిద్యాలయాల ఏర్పాటు అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం. కేంద్ర ప్రభుత్వ నిధులను ముఖ్యమంత్రి జగన్‌ దారి మళ్లిస్తూ అవినీతికి పాల్పడుతున్న వైనాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం. ఎన్జీటీ, అటవీ శాఖ అభ్యంతరాలను కాదని రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్‌ అక్రమాలకు పాల్పడుతోంది. వీటిపై పార్లమెంట్‌లో ప్రస్తావించి దేశప్రజల దృష్టికి తీసుకెళ్తామ’ని చెప్పారు. ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి దిల్లీ వచ్చినప్పుడల్లా రాష్ట్ర అంశాలపై కాకుండా అప్పుల కోసం తిరుగుతున్నారని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ పునర్విభజన చట్టానికి ఏడాదిన్నర గడువు మాత్రమే ఉన్నందున ఆలోపే హామీలు నెరవేర్చుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని