అప్పుడు చంద్రబాబే పెద్ద బీసీ.. ఇప్పుడు జగనే పెద్ద బీసీనా?
‘చంద్రబాబే పెద్ద బీసీ... వైఎస్ రాజశేఖర్రెడ్డి బీసీలకు చేసిందేమీ లేదు...’’ అంటూ తెదేపాలో ఉన్నప్పుడు మాట్లాడిన ప్రస్తుత శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం.. ఇప్పుడు ‘‘వైఎస్ జగనే... పెద్ద బీసీ, పెద్ద ఎస్సీ, పెద్ద ఎస్టీ, పెద్ద మైనార్టీ...’’ అని వ్యాఖ్యానించడాన్ని చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతోందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శించారు.
తమ్మినేని సీతారాంను చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతోంది
తెదేపా నాయకుడు కూన రవికుమార్ ధ్వజం
ఈనాడు-అమరావతి: ‘చంద్రబాబే పెద్ద బీసీ... వైఎస్ రాజశేఖర్రెడ్డి బీసీలకు చేసిందేమీ లేదు...’’ అంటూ తెదేపాలో ఉన్నప్పుడు మాట్లాడిన ప్రస్తుత శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం.. ఇప్పుడు ‘‘వైఎస్ జగనే... పెద్ద బీసీ, పెద్ద ఎస్సీ, పెద్ద ఎస్టీ, పెద్ద మైనార్టీ...’’ అని వ్యాఖ్యానించడాన్ని చూసి ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతోందని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ విమర్శించారు. రాజకీయాల్లో పార్టీలు మారినా వ్యక్తిత్వం మారకూడదని, ఇలా పూటకో మాట మాట్లాడే వ్యక్తి సభాపతిగా ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు. మన దేశంలో వెయ్యి రూపాయిల నోటుకు, రాష్ట్రంలో తమ్మినేని సీతారాం మాటలకు విలువ లేదని, ఆయన ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజారెడ్డి నుంచి నేటి జగన్రెడ్డి వరకూ వైఎస్ కుటుంబీకులంతా బీసీల శవాల మీద రాజకీయ పునాదులు ఏర్పాటు చేసుకున్నవారేనని చెప్పారు. జగన్రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా అణగదొక్కుతున్నారన్నారు. ‘‘ స్థానిక సంస్థల రిజర్వేషన్లలో కోతవేసి 16,800 మంది బీసీలను ప్రజా ప్రతినిధులుగా కాకుండా అడ్డుకోలేదా? బీసీలకు చెందిన 8 వేల ఎకరాల భూములను బలవంతంగా లాక్కున్నది జగన్మోహన్రెడ్డి కాదా? సీఎం సలహాదారుల్లో బీసీలు ఎంత మంది? బీసీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించి ద్రోహం చేయలేదా? 26 మంది బీసీలను పొట్టన పెట్టుకున్న వైకాపా నాయకులకు బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా? 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పడం కాదు.. వాటి కోసం కనీసం రూ.56 అయినా ఖర్చు చేశారా?’’ అని కూన రవికుమార్ నిలదీశారు. తితిదే ఛైర్మన్ పదవిని చంద్రబాబు బీసీలకు ఇస్తే.. జగన్రెడ్డి మాత్రం తన సొంత బాబాయ్కు కట్టబెట్టారని పేర్కొంటూ సీతారామ్ దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. వైకాపా నేతలు రంకెలు వేయడం ఆపేసి చర్చకు వస్తే బీసీలకు ఎవరేమి చేశారో అంకెలతో సహా వివరించటానికి సిద్ధంగా ఉన్నామని కూన రవికుమార్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.