తెలంగాణ ఎమ్మెల్యేలు అమ్ముడుబోరు: పోచారం

తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరూ డబ్బులకు అమ్ముడుపోయేవారు కాదని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Published : 07 Dec 2022 05:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరూ డబ్బులకు అమ్ముడుపోయేవారు కాదని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. చావనైనా చస్తాం తప్ప ప్రభుత్వాన్ని విడిచిపెట్టబోమని, కేసీఆర్‌ను వదలబోమని ఆయన స్పష్టంచేశారు. ప్రభుత్వాలను కూల్చడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పేర్కొన్నారు. తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని ఆయన విగ్రహానికి పోచారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ దండె విఠల్‌, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం విలేకరులతో మాట్లాడారు. ‘‘47 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇటీవల ఒక పత్రికలో పార్టీ మార్చే శాసనసభ్యుల నియోజకవర్గాలంటూ బాన్సువాడ పేరొచ్చింది. అది పచ్చి అబద్ధం. ఎమ్మెల్యేలంతా సీఎంను బలపరుస్తూ, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను అమలుపరుస్తున్నారు. ఏదో ఒక పేరుతో పాదయాత్రలు చేస్తూ విమర్శలు చేయడం, ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం మంచిది కాదు.’’ అని పోచారం అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని