సమైక్య రాష్ట్రమే మా విధానం

‘అప్పుడూ, ఇప్పుడూ మా విధానం సమైక్య రాష్ట్రమే.. కుదిరితే ఏపీ ఉమ్మడిగా ఉండాలనేదే మా కోరిక.. ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే మొదట స్వాగతించేది వైకాపానే’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Updated : 09 Dec 2022 07:09 IST

‘ఉమ్మడి’ కాగలిగితే మొదట స్వాగతించేది మేమే  
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘అప్పుడూ, ఇప్పుడూ మా విధానం సమైక్య రాష్ట్రమే.. కుదిరితే ఏపీ ఉమ్మడిగా ఉండాలనేదే మా కోరిక.. ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే మొదట స్వాగతించేది వైకాపానే’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘కుదిరితే ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా విధానం.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచీ పోరాటం చేసింది వైకాపానే. కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలిగితే.. రాష్ట్రం మళ్లీ కలవాలని సుప్రీం చెబితే.. అంతకంటే కావాల్సింది ఏముంటుంది?’ అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ‘2014 విభజన చట్టం అసంబద్ధం’ అనే అంశంపై కేసు వేసినట్లున్నారు. ఇంతకాలం తర్వాత ఆయన ఇప్పుడే ఎందుకు స్పందించారు? రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయి. ఆయన పనిగట్టుకుని ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించారని అనిపిస్తోంది. ఉండవల్లి చెబుతున్నట్లు.. కోర్టులో విభజన కేసు విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారంటున్న విషయం సాంకేతిక అంశం మాత్రమే. జరగాల్సిన రీతిలో విభజన జరగలేదనే అంశంపై కాలచక్రాన్ని వెనక్కి తీసుకెళ్లగలిగితే లేదా అసెంబ్లీ తీర్మానం, ఆర్టికల్‌ 3 ప్రకారం విభజన జరగలేదు కనుక మళ్లీ కలవండని సుప్రీంకోర్టు చెబితే, అంతకంటే కావాల్సింది ఏముంది? కానీ, రాష్ట్రం విడిపోయి ఇంతదూరం వచ్చిన తర్వాత.. పెండింగ్‌ అంశాలపైనే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఉండవల్లికి అనుమానమెందుకు వచ్చిందో కానీ, మా నాయకుడు జగన్‌ది ఒకటే విధానం. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాగలిగితే ముందుగా స్వాగతించేది వైకాపానే. ఎప్పుడైనా సరే కుదిరితే ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని వైకాపా ప్రభుత్వమూ కోరుకుంటుంది.. కానీ, ప్రాక్టికల్‌గా రాష్ట్రం విడిపోయి ఇంతదూరం వచ్చిన తర్వాత పెండింగ్‌ అంశాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన చేసి ఏపీకి అన్యాయం చేసింది అప్పట్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రతిపక్షంలోని భాజపా, వారికి సహకరించిన తెదేపాలే.. విభజనకు వ్యతిరేకంగా చివరి నిమిషం వరకు పోరాడింది వైకాపానే.. అయినా విభజన జరిగింది, విభజన హామీల సాధన కోసం వైకాపా పోరాటం చేస్తూనే ఉంది. ఉండవల్లికి అనుమానమెందుకు వచ్చిందో కానీ, మా నాయకుడు జగన్‌ది ఒకటే విధానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడానికి ఎలాంటి అవకాశం వచ్చినా ముందుగా స్వాగతించేది వైకాపానే. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలను బలంగా వినిపిస్తాం.. రాష్ట్ర విభజనను వెనక్కు తిప్పాలి లేదా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని గట్టిగా కోరతాం.. రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వాలు డీల్‌ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఇది ఉద్యమం కాదు కాబట్టి అలా చేయలేం. ఉండవల్లి ఎనిమిదేళ్ల క్రితం కోర్టులో వేసిన కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చెన్నై కావాలని వెనక్కి పోలేం కదా. ఈ విషయం ఉండవల్లికి కచ్చితంగా తెలుసు.. తెలిసినా ఇలా మాట్లాడితే మేం కూడా ప్రతిస్పందించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

సీఎం మాట్లాడుతుంటే ముందుకొచ్చారు

‘జయహో బీసీ’ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతున్నపుడు వెనక కుర్చీల్లో ఉన్నవారు ముందుకు వచ్చారు, కొంతమంది అటూఇటూ వెళ్లి ఉండొచ్చు, మరికొందరు భోజనాలకు వెళ్లడం వల్ల కుర్చీలు ఖాళీగా ఉండగా.. సీఎం మాట్లాడుతుంటే కుర్చీలు ఖాళీ అయ్యాయంటూ ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయి’ అని సజ్జల వ్యాఖ్యానించారు. బీసీల్లాగే త్వరలో ఎస్సీ, మైనారిటీల సభలను నిర్వహిస్తాం అని సజ్జల ప్రకటించారు.


మీ ప్రాంత అభివృద్ధి సంగతి చూస్కోండి: షర్మిల

ఈనాడు, హైదరాబాద్‌: ఎంతోమంది బలిదానాలు, త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యమని వైఎస్‌ షర్మిల గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకసారే జరుగుతాయి. విడదీసిన రాష్ట్రాలను ఎలా కలుపుతారు? మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడంపై కాదు. మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మీకు తగదు’ అని ఆమె పేర్కొన్నారు.


విభజనపై అర్థంలేని చర్చలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

రాష్ట్ర విభజనపై సజ్జల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు అనవసర చర్చను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కావాలనే ఈ సమయంలో విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని, ఇదో కుట్రని గురువారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి విషయంపై పలువురు కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కారు వల్ల గుజరాత్‌ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోంది. గుజరాత్‌లో భాజపా విజయం ఓ చరిత్ర’ అని వీర్రాజు పేర్కొన్నారు.


సంచలనాల కోసమే సజ్జల మాటలు: మంత్రి జగదీశ్‌రెడ్డి 

సూర్యాపేట(తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: సంచలనాల కోసమే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పునరేకీకరణపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. విభజన అంశంపై ఉండవల్లి వేసిన కేసు అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో ఆయన గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘గుజరాత్‌లో భాజపా విజయానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వైఫల్యమే కారణం. గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతుండగా.. ఎక్కడో పాదయాత్ర చేస్తే ఓట్లు ఎలా పడతాయి? తెలంగాణలోనూ గుజరాత్‌ తరహా ఫలితాలు వస్తాయన్న సంజయ్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజల మనస్సుల్లోంచి తెరాసను దూరం చేయలేరు. రాష్ట్రంలో హ్యాట్రిక్‌ విజయం ఖాయం. మోదీకి ప్రత్యామ్నాయంగా కేసీఆర్‌ కావాలని దేశప్రజలు కోరుకుంటున్నారు’’ అని జగదీశ్‌రెడ్డి అన్నారు.


విషం చిమ్ముతున్న సమైక్యవాదులు: పల్లా   

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేళ్లు దాటినా తెలంగాణపై సమైక్యవాదులు, పార్టీల నేతలు విషం చిమ్ముతున్నారని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పలుమార్లు తెలంగాణ ఆవిర్భావాన్ని అవమానిస్తూ మాట్లాడారని.. ఆయన కుట్రల వల్లే తెదేపా, వైకాపా నేతలు సమైక్యరాగం ఆలపిస్తున్నారని విమర్శించారు. గురువారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.


తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే యత్నం

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిల ప్రత్యేక ఎజెండాతోనే ఆయన వ్యాఖ్యలు చేశారన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు పేరుకుపోయాయని.. వాటిని నెరవేర్చుకోవడంపై పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్రవిభజనపై ప్రధాని హోదాలో మోదీ పలుమార్లు విషపూరిత వ్యాఖ్యలు చేశారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని