ఆప్‌.. ఇక జాతీయ పార్టీ

దశాబ్దం క్రితం అన్నాహజారే ప్రారంభించిన జన్‌లోక్‌పాల్‌ ఉద్యమం ద్వారా ప్రాచుర్యం పొందిన కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌).. ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది.

Published : 09 Dec 2022 06:38 IST

గుజరాత్‌ ఓట్లతో దక్కిన హోదా  

పార్టీ పెట్టిన పదేళ్లకే వచ్చింది: కేజ్రీవాల్‌

దిల్లీ: దశాబ్దం క్రితం అన్నాహజారే ప్రారంభించిన జన్‌లోక్‌పాల్‌ ఉద్యమం ద్వారా ప్రాచుర్యం పొందిన కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌).. ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది. దిల్లీలో పుట్టిన ఈ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఘన విజయాలు సాధించడంతో పాటు తాజాగా జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఇటీవల జరిగిన గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లోనూ గెలిచి జాతీయస్థాయిలో భాజపాకు ప్రత్యామ్నాయంగా నిలిచి, కాంగ్రెస్‌ స్థానాన్ని భర్తీ చేయాలని భావించినా.. ఆ పార్టీ ఆశలు అడియాసలయ్యాయి.

జాతీయపార్టీ హోదా ఇలా..

ఏదైనా పార్టీకి జాతీయహోదా రావాలంటే.. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున ఓట్లు పొందాలి. లేదా.. ఏవైనా 4 రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు సాధించాలి. ప్రస్తుతం ఆప్‌.. దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు, 6% ఓట్లు దక్కించుకుంది. ఇప్పుడు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచి 12% ఓట్లు సాధించింది. దీంతో జాతీయపార్టీగా అవతరించేందుకు అర్హత సాధించినట్లయింది.

థాంక్యూ గుజరాత్‌: కేజ్రీవాల్‌

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో ఆమ్‌ ఆద్మీ పార్టీకి జాతీయపార్టీ హోదా దక్కిందని కేజ్రీవాల్‌ వెల్లడించారు. తమ పార్టీకి ఓట్లువేసి గొప్ప అవకాశాన్ని కల్పించడంలో సహకరించిన గుజరాత్‌ ప్రజలు, ఆప్‌ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. గుజరాత్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేజ్రీవాల్‌ వీడియో ప్రసంగం చేశారు. దేశంలో కొన్ని పార్టీలకే జాతీయపార్టీ హోదా లభిస్తుందని.. పదేళ్ల క్రితం చిన్నపార్టీగా ఉన్న ఆప్‌ ఇప్పుడు జాతీయపార్టీ అయ్యిందని హర్షం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని