మెట్రోకు శంకుస్థాపన చేసే అర్హత కేసీఆర్‌కు లేదు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని, ఆ ప్రణాళికలో భాగంగానే ఫాంహౌస్‌ని వీడి జిల్లాల్లో బహిరంగ సభలు పెడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 09 Dec 2022 05:14 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని, ఆ ప్రణాళికలో భాగంగానే ఫాంహౌస్‌ని వీడి జిల్లాల్లో బహిరంగ సభలు పెడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఓవైపు తెలంగాణ సెంటిమెంట్‌ని రేకెత్తించాలని ప్రయత్నిస్తూ.. మరోవైపు రూ.కోట్ల నిధులు ఇస్తామంటూ బూటకపు ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రక్తం ఏరులై పారినా హైదరాబాద్‌లో మెట్రో ప్రాజెక్టు వద్దని అప్పట్లో అన్న కేసీఆర్‌కు ఇప్పుడు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో నిర్మాణానికి శంకుస్థాపన చేసే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పేదలు ప్రయాణించే రూ.800 కోట్ల ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా కింద రూ.500.41 కోట్ల నిధుల్ని కేసీఆర్‌ ఇవ్వలేదన్నారు. దీంతో 2008లో లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టు 2022 నాటికీ పూర్తి కాలేదని ఆక్షేపించారు. ఎంఎంటీఎస్‌ రెండో దశకు మిగతా వాటా డబ్బులివ్వాలని సీఎంకు నాలుగుసార్లు లేఖలు రాసినా స్పందించలేదు. అలాంటి ముఖ్యమంత్రి రూ.6,250 కోట్లతో ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తానంటే హైదరాబాద్‌ ప్రజలు నమ్ముతారా అని కిషన్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ‘‘మెట్రో మొదటి దశ నిర్మాణంలో భాగంగా వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద దాదాపు రూ.1,500 కోట్లు ఇవ్వడానికి అంగీకరించిన కేంద్రం ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్లు ఇచ్చింది. ఓల్డ్‌ సిటీలో మెట్రో పనులను ప్రారంభిస్తే మిగతా నిధులివ్వడానికి సిద్ధంగా ఉంది. ఫలక్‌నుమా వరకు పనుల్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? ఒవైసీ సోదరులు చెప్పినట్లే పాతబస్తీ ప్రజలకు మెట్రోను దూరం చేస్తున్నారా? కేసీఆర్‌ ప్రభుత్వ తీరు పరిశీలిస్తే ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో 65 ఏళ్లయినా పూర్తికాదు’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని