సతుల్‌.. సుతుల్‌.. హితుల్‌ పోతేపోనీ

పోతే పోనీ సతుల్‌ సుతుల్‌ హితుల్‌... వస్తే రానీ కష్టాల్‌ నష్టాల్‌ కోపాల్‌ తాపాల్‌ శాపాల్‌ అని శ్రీశ్రీ మహాప్రస్థానంలో చెప్పిన మాటలను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వంటబట్టించుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన ప్రస్తుతం  జరుగుతున్న ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ సభ్యులను ఎస్పీ రాజకీయాలకు దూరంగా పెట్టి ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. ఇప్పుడు తాను, తన తలపై ఎర్ర టోపీ తప్ప మిగిలిన పరివార ఛాయలేవీ కనిపించకుండా జాగ్రత్త

Published : 21 Jan 2022 05:02 IST

కొత్త పంథా అనుసరిస్తున్న అఖిలేశ్‌ యాదవ్‌
కుటుంబ పార్టీ ముద్రకు దూరంగా ప్రచారం
ఈనాడు - దిల్లీ

పోతే పోనీ సతుల్‌ సుతుల్‌ హితుల్‌... వస్తే రానీ కష్టాల్‌ నష్టాల్‌ కోపాల్‌ తాపాల్‌ శాపాల్‌ అని శ్రీశ్రీ మహాప్రస్థానంలో చెప్పిన మాటలను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వంటబట్టించుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన ప్రస్తుతం  జరుగుతున్న ఉత్తర్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ సభ్యులను ఎస్పీ రాజకీయాలకు దూరంగా పెట్టి ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. ఇప్పుడు తాను, తన తలపై ఎర్ర టోపీ తప్ప మిగిలిన పరివార ఛాయలేవీ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. సొంతమరదలు అపర్ణా బిస్త్‌ యాదవ్‌, ములాయం తోడల్లుడు  ప్రమోద్‌ గుప్తా పార్టీని వదిలి భాజపా తీర్థం పుచ్చుకున్నా.. అఖిలేశ్‌ వారిని పార్టీలో ఉంచుకునేందుకు పెద్దగా ప్రయత్నించలేదు. ‘‘ఎస్పీ అంటే కుటుంబ పార్టీ అని ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వచ్చిన భాజపా ఇప్పుడు మా కుటుంబసభ్యులను చేర్చుకొని మా మీద ఉన్న నిందను తుడిపేస్తున్నందుకు, బరువు తగ్గిస్తున్నందుకు భాజపాకు ధన్యవాదాలు చెబుతున్నా’’ అని అఖిలేశ్‌ చమత్కరించారు. ఎప్పటినుంచో  భాజపావైపు మొగ్గుచూపుతూ  కంట్లో నలుసులా తయారైన ఇంటి కోడలు పార్టీ ఫిరాయించడానికి సిద్ధమైందని తెలిసినా ఆమెను అఖిలేశ్‌ నిలువరించే ప్రయత్నం చేయలేదు. ఎస్పీ ఓ కుటుంబ పార్టీ, తండ్రి, కుమారుడు, బాబాయ్‌, కోడళ్లదే పెత్తనం తప్ప ఇంకెవరికీ చోటులేదని భాజపా గత ఎన్నికల్లో ప్రచారం చేసి సాధ్యమైనంతమేరకు నష్టాన్ని చేకూర్చింది. ఈసారి అలాంటి వెసులుబాటును మోదీ లాంటి వాక్చాతుర్యం ఉన్న నేతలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో మొత్తం కుటుంబాన్ని దూరంపెట్టి ఒంటరిగానే అఖిలేశ్‌ గోదాలోకి దిగారు.

కుటుంబ ఛాయలు కనిపించకుండా...

ప్రస్తుత ఎన్నికల్లో ఎక్కడా ములాయం జాడ, నీడకూడా కనిపించకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు అఖిలేశ్‌. 2017 ఎన్నికల సమయంలో అఖిలేశ్‌-శివపాల్‌యాదవ్‌ మధ్య కుటుంబ యుద్ధం మొదలైనప్పుడు యువనేత పక్షాన నిలిచిన ములాయం సోదరుడు రామ్‌గోపాల్‌  యాదవ్‌, అఖిలేశ్‌కు తమ్ముడి వరుసైన ధర్మేంద్రయాదవ్‌ ఛాయలు కూడా ఈసారి ఎక్కడా బహిరంగంగా కనిపించడంలేదు. 2017 ఎన్నికల్లో ప్రముఖ ప్రచారకర్తగా, నిరంతరం అఖిలేశ్‌ వెంట నిలిచిన ఆయన సతీమణి డింపుల్‌యాదవ్‌ కూడా ఈసారి బహిరంగంగా దర్శనమివ్వడం లేదు. ఇప్పుడు అఖిలేశ్‌, ఓంప్రకాశ్‌  రాజ్‌భర్‌ నేతృత్వంలోని సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌పార్టీ (ఎస్‌బీఎస్‌పీ), జయంత్‌సింగ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌, శివపాల్‌యాదవ్‌ నేతృత్వంలోని ప్రగతిశీల్‌ సమాజ్‌ పార్టీలతో కలిసి పోటీకి దిగుతున్నారు. ఇందులో శివపాల్‌ను చిన్నాన్నగా కాకుండా ఓ పార్టీ నేతగా పరిగణించి పొత్తులుపెట్టుకొని ముందుకు నడుస్తున్నారు. నానాటికీ కొత్తతరం ఓటర్ల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో పాత తరం రాజకీయాలకు స్వస్తిపలికే దిశలో అఖిలేశ్‌ అడుగులేస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ములాయం రెండు లోక్‌సభ స్థానాలనుంచి, ఆయన కుటుంబసభ్యులు మరో మూడు సీట్ల నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ములాయం ఒక స్థానం నుంచి రాజీనామా చేయడంతో అందులోనూ సోదరుడి కుమారుడినే పోటీచేయించి గెలిపించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఎస్పీ గెలిచిన అయిదుసీట్లూ ములాయం కుటుంబసభ్యుల చేతుల్లోనే ఉండటం విమర్శలకు తావిచ్చింది. ఎస్పీ కుటుంబపార్టీ అన్న వాదనకు బలమైన ముద్రపడింది. దాన్నుంచి బయటపడటానికి ఇప్పుడు అఖిలేశ్‌ నడుం బిగించారు. పార్టీపై పూర్తి పట్టురావడం, కేడర్‌లో తన నాయకత్వంపై నమ్మకం కలిగేలా చేసుకోవడంతో  ఇప్పుడు ఆయన కుటుంబ రాజకీయాలనుంచి బయటపడే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.

కొత్తతరంతో ముందుకు...

ములాయంకు అండగా నిలిచిన సీనియర్‌ నేతలు ఎవ్వరూ ఇప్పుడూ అఖిలేశ్‌ వెంట లేకపోయినా కొత్తతరాన్ని వెంటేసుకొని ఆయన ముందుకు కదులుతున్నారు. కేవలం కుటుంబ ఛాయల నుంచే కాకుండా ఎస్పీ అంటే యాదవ్‌ పార్టీ అన్న ముద్ర నుంచి కూడా బయటపడటంకోసం ఇతర ఓబీసీ వర్గాలను కలుపుకొనిపోయే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ప్రసంగాలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల జోలికి పోకుండా తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెబుతూ, సున్నితమైన హాస్యంతో ప్రత్యర్థులపై ఛలోక్తులు విసురుతూ ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో చూడటానికి చాలా పార్టీలు కనిపిస్తున్నా పోటీ మాత్రం అఖిలేశ్‌ వర్సెస్‌ భాజపా అన్నట్లే కనిపిస్తోంది. బహుముఖ పోటీని ప్రజలు క్రమంగా ముఖాముఖి పోటీగా భావించేలా చేయడంలో అఖిలేశ్‌ కొంత కృతకృత్యులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని