హైదరాబాద్‌ మేయర్‌గా విజయలక్ష్మి

జీహెచ్‌ఎంసీ మేయర్‌ గా బంజారాహిల్స్‌ తెరాస కార్పొరేటర్‌, సీనియర్‌నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు.

Updated : 11 Feb 2021 13:51 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మేయర్‌గా బంజారాహిల్స్‌ తెరాస కార్పొరేటర్‌, సీనియర్‌నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. మేయర్‌ పదవి కోసం భాజపా తరఫున ఆర్కేపురం డివిజన్‌ నుంచి ఎన్నికైన రాధ ధీరజ్‌రెడ్డి నామినేషన్‌ వేయగా.. ఎన్నికల అధికారి శ్వేతామహంతి ఓటింగ్‌ నిర్వహించారు. అనంతరం విజయలక్ష్మి మేయర్‌ గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్‌ ఎన్నికలో ఎంఐఎం కూడా తెరాస అభ్యర్థికే మద్దతు తెలిపింది. ఉప మేయర్‌గా తార్నాక కార్పొరేటర్‌ మోతె శ్రీలత విజయం సాధించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవుల కోసం తెరాస, భాజపా పోటీ పడగా చివరికి ఎంఐఎం మద్దతుతో రెండు పీఠాలను తెరాస కైవసం చేసుకుంది. మేయర్‌గా ఎన్నికైన విజయలక్ష్మి రెండు సార్లు బంజారాహిల్స్‌ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

మేయర్‌ ఎన్నికకు ముందు జీహెచ్‌ఎంసీ నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం సందడిగా జరిగింది. తమకు అనుకూలమైన భాషలో ప్రమాణం చేసేందుకు అనుమతి ఇవ్వాలని  వివిధ పార్టీల కార్పొరేటర్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు ప్రిసైడింగ్‌ అధికారి శ్వేతామహంతి .. నచ్చిన భాషలో ప్రమాణ స్వీకారానికి అనుమతిచ్చారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషలో కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. తెరాస, భాజపా, ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 149 మంది కార్పొరేటర్లు ప్రమాణం చేశారు.

ఫలించిన తెరాస వ్యూహం

బల్దియాలోని 150 మంది కార్పొరేటర్లకు గాను తెరాసకు 56, భాజపాకు 48 మంది(వీరిలో ఒకరు చనిపోవడంతో 47) కార్పొరేటర్లు ఉన్నారు. ఎంఐఎంకు 44 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు ఉన్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యులు తెరాసకు 32, భాజపాకు 2, ఎంఐఎంకు 10 మంది ఉన్నారు. మేయర్‌ ఎన్నికకు 97 మంది సభ్యులతో కోరం ఉండాలి. ఈనేపథ్యంలో 56 మంది సభ్యులున్న తెరాస ఎంఐఎం మద్దతుతో వ్యూహాత్మకంగా రెండు పదవులనూ కైవసం చేసుకుంది. దీంతో తెరాసకు ఎక్స్‌అఫిషియో సభ్యుల మద్దతు అవసరం లేకుండా పోయింది. ఎంఐఎం మద్దతు తీసుకుంటే ఆ పార్టీకి ఉప మేయర్‌ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఎంఐఎంకు ఉప మేయర్‌ పదవి ఇవ్వకుండానే రెండు పీఠాలను తెరాస కైవసం చేసుకోవడం గమనార్హం.

సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు కృతజ్ఞతలు
 ఒకేసారి ఇద్దరు మహిళలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని పార్టీల సభ్యులను కలుపుకొని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం అందరి సలహాలు స్వీకరిస్తామని, అవినీతిపై పోరాటం కోసం ఎంతదూరమైనా వెళ్తానని విజయలక్ష్మి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

హైదరాబాద్‌లో ఎన్‌కామ్‌

వాళ్లు రైతు రాబందులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని