karnatka Elections: పార్టీ ఫిరాయింపులు పని చేశాయా?

Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు నేతలు పార్టీని ఫిరాయించి వేరే పార్టీల్లో చేరారు. అయితే, వాళ్లను ప్రజలు ఎంతమేర ఆదరించారో పరిశీలిద్దామా?

Published : 14 May 2023 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections) సీట్ల కేటాయింపు విషయంలో అన్ని పార్టీలూ మల్లగుల్లాలు పడ్డాయి. కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. టికెట్‌ ఆశావాదులను చాలా వరకు బుజ్జగించగా.. భాజపా మాత్రం అందులో విఫలమైంది. కొత్త వారికి టికెట్లు కేటాయించాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ అనుసరించిన విధానం కీలక నేతలను నొప్పించింది. దీంతో చాలా మంది పార్టీని ఫిరాయించారు. కాంగ్రెస్‌ నుంచి కూడా కొంతమంది బయటకి వచ్చారు. అయితే అలాంటి వారు ఈ ఎన్నికల్లో ఎంత మేరకు విజయం సాధించారన్నది ఓ సారి పరిశీలిస్తే..!

జగదీశ్‌ శెట్టర్‌

భాజపా తొలి విడత జాబితా ప్రకటించిన తర్వాత రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపించిన పేరు జగదీశ్‌ శెట్టర్‌. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఆయనకు భాజపా టికెట్‌ నిరాకరించడంతో, తీవ్ర అసహనానికి గురై పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అధిష్ఠానం ఆయనకు హుబ్బళిలోని ధర్వాడ్‌ సెంట్రల్‌ స్థానాన్ని కేటాయించింది. కానీ, తాజాగా వెలువడిన ఫలితాల్లో జగదీశ్‌ శెట్టర్‌, భాజపా అభ్యర్థి మహేశ్‌ తెంగిన్‌కాయ్‌ చేతిలో 34,289 ఓట్ల భారీ తేడాతో పరాజయం పాలయ్యారు.

లక్ష్మణ్‌ సావడి

భాజపా నుంచి కాంగ్రెస్‌లో చేరిన మరో నేత లక్ష్మణ్‌ సావడి. అథానీ అసెంబ్లీ నియోజవర్గం నుంచి బరిలోకి దిగిన లక్ష్మణ్‌.. భాజపా అభ్యర్థి మహేశ్‌ కుమతల్లిపై 76,122 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మహేశ్‌కుమతల్లి కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరడం గమనార్హం. లక్ష్మణ్‌ సావడి ఆగస్టు 2019 నుంచి జులై 2021 మధ్య కర్ణాటక ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు.

కిరణ్‌ కుమార్‌

తుముకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి నుంచి కాంగ్రెస్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన కిరణ్‌ కుమార్‌ ఓటమి పాలయ్యారు. సమీప ప్రత్యర్థి, జేడీఎస్‌ అభ్యర్థి సురేశ్‌ బాబుపై 10,042 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. కిరణ్‌కుమార్‌ గత ఫిబ్రవరిలో భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

హెచ్‌డీ తమ్మయ్య

అందరి దృష్టినీ ఆకర్షించిన చిక్‌మంగళూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన హెచ్‌డీ తమ్మయ్య.. భాజపా అభ్యర్థి సీటీ రవిని 5,926 ఓట్ల తేడాతో ఓడించారు. తమ్మయ్య గతంలో సీటీ రవికి సహాయకుడిగా పని చేశారు.

ఎంపీ కుమారస్వామి

ముదిగెరె స్థానాన్ని తనకు కేటాయించలేదనే కారణంతో భాజపాను వీడి జేడీఎస్‌లో చేరిన ఎంపీ కుమారస్వామి కూడా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నయన మోతమ్మ చేతిలో 24,805 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. దీనిని బట్టి పార్టీని నుంచి వైదొలిగిన కొందరు అభ్యర్థులు లాభపడగా.. కొందరికి మాత్రం జెండా మార్చినా ఫలితం మారలేదని స్పష్టమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని