UP Elections:సమాజ్‌వాదీ పార్టీలోకి దేశంలోనే అత్యంత పొడగరి వ్యక్తి

దేశంలో అత్యంత పొడగరి వ్యక్తిగా గుర్తింపు పొందిన యూపీకి చెందిన ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరోత్తమ్‌ ఉత్తమ్‌ పటేల్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు.

Published : 23 Jan 2022 15:28 IST

దిల్లీ: దేశంలో అత్యంత పొడగరి వ్యక్తిగా గుర్తింపు పొందిన యూపీకి చెందిన ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్‌ ఉత్తమ్‌ పటేల్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ధర్మేంద్ర ప్రతాప్‌ రాకతో రాబోయే ఎన్నికల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా నరేష్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. సమాజ్‌వాదీ విధానాలు నచ్చి ఆయన చేరారని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధరి తెలిపారు. పార్టీ అధినేత అఖిలేష్‌తో దిగిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. 

ఏ పార్టీతో సంబంధంలేని ధర్మేంద్ర ప్రతాప్‌ తొలిసారి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. పొడవైన వ్యక్తిగా ఆయకున్న క్రేజ్‌ను సమాజ్‌ వాదీ పార్టీ సైతం ప్రచారంలో వినియోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు తన జీవితంలో తనను ఇబ్బంది పెట్టింది ఏదైనా ఉంటే అది తన పొడవు మాత్రమేనని, అదే తనకు ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చిందని ధర్మేంద్ర ప్రతాప్‌సింగ్‌ తెలిపారు. తాను బయట అడుగు పెడితే సెల్ఫీలు తీసుకోవడానికి ప్రజలు ఎగబడుతుంటారని చెప్పారు. ప్రతాప్‌గఢ్‌కు చెందిన ప్రతాప్‌ సింగ్‌ పొడవు 8 అడుగుల 1 అంగుళాలు. ప్రపంచ రికార్డు కలిగిన వ్యక్తి కంటే 11 సెంటీమీటర్లు తక్కువ పొడవు ఉన్న ప్రతాప్‌ సింగ్‌ దేశంలోని అత్యంత పొడవైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని